పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి సుఖ్జిందర్ సింగ్ రంధావా తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీని హైదరాబాద్ లోని హోం మంత్రి కార్యాలయంలో గురువారం నాడు కలిశారు. పంజాబ్ జైళ్ల శాఖ అధికారులతో కలిసి తెలంగాణ రాష్ట్రంలోని జైళ్ల శాఖ స్థితిగతులను అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ లోని వివిధ జైళ్ల ను సందర్శించారు. రాష్ట్ర జైళ్ల శాఖలో ఖైదీలలో మార్పు తెచ్చేందుకు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి అధ్యయనం చేసేందుకు పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి ఆధ్వర్యంలో అధికారుల బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నది.
ఈ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ఖైదీలు చదువుకునేందుకు అన్ని సౌకర్యాలను కల్పించామని తెలిపారు. వారు పనిచేసేందుకు పరిశ్రమల యూనిట్ను ఏర్పాటు చేశామని తెలియజేశారు. శిక్షాకాలం పూర్తి చేసుకున్న ఖైదీలకు జైలు శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్ బంకుల్లో ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి సుఖ్జిందర్ సింగ్ రంధావా మాట్లాడుతూ గురువారం నాడు చెర్లపల్లి లోని కారాగారాన్ని, ఓపెన్ ఎయిర్ జైలును సందర్శించామని తెలిపారు. శుక్రవారం నాడు మరికొన్ని జైళ్ల ను పరిశీలిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా చార్మినార్ మెమెంటోను పంజాబ్ మంత్రికి హోంమంత్రి బహుకరించారు. తెలంగాణ జైళ్ల శాఖ డిజి రాజీవ్ త్రివేది, ఐజి సైదయ్య, పంజాబ్ ప్రిజన్స్ ఏడిజిపి ప్రవీణ్ కె సింహా, ఎస్పీఎస్ ఒబెరాయ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ