హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటినుంచి 12 రోజులపాటు జరుగనున్న మహా క్రతువులో భాగంగా తొలిరోజైన బుధవారం ఉదయం పెరుమాళ్ళ శోభాయాత్ర జరిగింది. ఇక సాయంత్రం సహస్రాబ్ది ఉత్సవాలకు వేదపారాయణాల నడుమ అంకురార్పణ జరిగింది. త్రిదండి చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ఈ అంకురార్పణ కార్యక్రమం జరిగింది.
త్రిదండి చిన్న జీయర్ స్వామి నేతృత్వంలో.. రుత్వికులు, పీఠాధిపతుల శ్రీమన్నారాయణ అష్టాక్షరి మంత్రోచ్ఛరణతో అంగరంగ వైభవంగా పల్లకిలో ఊరేగుతూ పెరుమాళ్లు యాగశాలకు చేరుకున్నారు. అనంతరం విశ్వక్ సేనుడి పూజ, వాస్తు శాంతి పూజ విజయవంతంగా జరిగింది. ఆ తర్వాత ప్రధాన ఘట్టమైన వాస్తు శాంతి పూజను నిర్వహించారు. పిదప యాగశాల ప్రాంగణంలో వాస్తు శాంతి చేసిన స్థలాన్ని అగ్నితో శుద్ధి చేశారు. దీని విశిష్టతను, వాస్తు శాంతి పూజ ప్రాధాన్యతను గురించి చిన్నజీయర్ స్వామి దర్శనార్ధం వచ్చిన భక్తులకు తెలియచెప్పారు.
సమతామూర్తి పేరుతో 216 అడుగుల శ్రీ రామానుజాచార్యుల విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించిన సంగతి తెలిసిందే. యాగశాలలో 1035 కుండాలలో మహాయజ్ఞం చేయటానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈ మహా వేడుకలలో 10 వేలకు పైగా వాలంటీర్లు భక్తులకు సేవలందిస్తున్నారు. శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలకు ఈ నెల 5న ప్రధాని మోదీ, 13న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ విచ్చేయనున్నారు. వీరి కోసం ప్రత్యేక హెలిప్యాడ్ను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో.. ఆశ్రమం పరిసరాలను కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ