తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ అక్టోబర్ 19న తలపెట్టిన రాష్ట్ర బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి అన్నారు. గత 11 రోజులుగా ఆర్టీసీ కార్మికులు తీవ్ర స్థాయిలో సమ్మె చేస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, త్వరితగతిన కార్మికుల డిమాండ్లపై స్పందించకపోతే అక్టోబర్ 21 న ప్రగతిభవన్ ముట్టడిస్తామని చెప్పారు. మంగళవారం నాడు గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రులు దామోదర రాజనరసింహ, షబ్బీర్అలీతో కలిసి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కార్మికులతో వెంటనే చర్చలు జరిపి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేసారు. మంత్రులు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వలనే, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
దామోదర రాజనరసింహ మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి నియంతృత్వంగా వ్యవరిస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదని చెప్పారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం జవాబుదారీతనంతో ఉండాలని సూచించారు. కేంద్రప్రభుత్వం సైతం ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో స్పందించి, పరిష్కరానికి కృషి చేయాలన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారని సీఎం అంటుంటే, రాష్ట్ర మంత్రులు మాత్రం వచ్చి విధుల్లో చేరాలని కోరుతూ డబుల్ గేమ్ ఆడుతున్నారని అన్నారు. అనుభవం లేని వారితో బస్సులు నడిపించడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని షబ్బీర్ అలీ విమర్శించారు.
[subscribe]