తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆదాయం పెంచడంపై సీరియస్ గా దృష్టి సారిస్తున్నారు. ఖజానా నిండుగా ఉంటేనే పేదలకు ఇచ్చిన అభయహస్తం హామీలను నెరవేర్చగలం అని భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. నూతన పారిశ్రామిక, ఐటీ విధానాలపై కసరత్తు చేస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో ఆయన రేపు రాత్రి దావోస్ కు వెళ్లనున్నారు. అయితే.. ఆ పర్యటనకు ముందే ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడంపై రేవంత్ కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుతో చర్చలు జరిపారు. సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, వేణుగోపాల్లను కలిసి రేవంత్ వారి సూచనల కనుగుణంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్యేల కోటాలో రెండు..గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీల పదవులు త్వరలో భర్తీ కానుండటంతో కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు తీవ్ర టెన్షన్కు లోనవుతున్నారు. తమకు అవకాశం వస్తుందా.. రాదా .. అనే ఆందోళనతో పార్టీలోని ముఖ్యులందరి వద్దా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్ల పై ఆరా తీస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, పాడి కౌశిక్రెడ్డిలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేయడంతో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. ఎమ్మెల్యేల బలం రీత్యా రెండు పదవులూ కాంగ్రెస్కే దక్కనున్నాయి. దీంతో కాంగ్రెస్ నుంచి ఆ సీట్లను ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. మరోవైపు గవర్నర్ కోటాలోనూ రెండు ఎమ్మెల్సీ పదవులు భర్తీ కానున్నాయి. వాటికోసం ప్రయత్నిస్తున్నవారూ అధికసంఖ్యలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎవరికి అవకాశం కల్పిస్తుందన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తమ పేర్లు పరిశీలనలో ఉన్నాయా అని పలువురు నేతలు తమకు తెలిసిన కాంగ్రెస్ అగ్రనేతల వద్ద ఆరా తీస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రేపు రాత్రి దావోస్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఢిల్లీ లో ఈ విషయమై ఓ నిర్ణయానికి వెచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాల కోసం ఎందరెందరో పోటీ పడుతున్నప్పటికీ.. వాటిల్లో ఒకటి ప్రొఫెసర్ కోదండరామ్కు ఖాయమైనట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుదుర్చుకున్న అవగాహన మేరకు ఆయనకు ఒకసీటు తప్పని సరిఅని.. ప్రకటించడం మాత్రమే మిగిలిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మిగతా మూడు స్థానాల్లో ఎవరెవరిని అదృష్టం వరించనుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సుదీర్ఘకాలంగా అంకితభావంతో పార్టీకి పనిచేస్తున్నవారు.. వివిధ సమీకరణలతో అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు పొందలేకపోయిన వారు.. టిక్కెట్లు పొందినప్పటికీ గెలవలేకపోయిన వారు.. ఇతరత్రా అంశాల్లో పార్టీకి పూర్తిగా సహకరించి, కొన్ని త్యాగాలు చేసినవారు.. వీరిలో ఉన్నారు. ప్రస్తుతం పేర్లు వినిపిస్తున్న వారిలో షబ్బీర్అలీ, జగ్గారెడ్డి, చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్, మహేశ్కుమార్గౌడ్, సంపత్కుమార్, నిరంజన్,మధుయాష్కిగౌడ్, శోభారాణి, అనిల్కుమార్, ఫిరోజ్ఖాన్, అజారుద్దీన్,పటేల్ రమేశ్రెడ్డి,తీన్మార్ మల్లన్న, ఫాహీమ్, ఖురేషి, అజ్మతుల్లా హుస్సేనీ,తదితరులున్నారు. మైనార్టీల్లో ఒకరికి తప్పనిసరిగా ఇస్తారని చెబుతున్నారు. బీసీ,ఎస్సీల నుంచి కూడా ఒకరికి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ అదృష్టవంతులెవరన్నది కొన్ని గంటల్లో వెల్లడి కానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE