కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మొన్నటి వరకు వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఇప్పుడు జనసేనలోకి వెళ్తారని వార్తలొస్తున్నాయి. అయితే వాళ్లు వీళ్లూ అనడం కాకుండా ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. స్వయంగా ముద్రగడ ఇంటికి పవన్ వెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఈ మేరకు మద్రగడ పద్మనాభంతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యేందుకు ముహూర్త ఖరారు అయిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
అయితే వైసీపీతో ముద్రగడ పద్మనాభంకు చెడడంతో.. వెంటనే జనసేన అప్రమత్తమయింది. జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ వెళ్లి ముద్రగడతో సమావేశమయ్యారు. పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడ జనసేనలో చేరితేనే కాపు సామాజిక వర్గ ప్రజలకు న్యాయం జరుగుతుందని సూచించారు. అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా తన ఇంటికి వస్తేనే అప్పుడు చేరికపై ఆలోచిస్తానని శ్రీనివాస్తో ముద్రగడ చెప్పారు. ఇదే విషయాన్ని బొలిశెట్టి శ్రీనివాస్.. పవన్ కళ్యాణ్కు చేరవేశారు. వెంటనే పవన్ కళ్యాణ్ ముద్రగడకు ఫోన్ చేసి మాట్లాడారు.
ఇప్పుడు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కలిసేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత ఈనెల 20 లేదా 23వ తేదీన పవన్.. ముద్రగడ పద్మనాభంతో సమావేశం కానున్నారు. కించర్లపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లి పవన్ భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు.. రాష్ట్రంలో పరిస్థితులపై చర్చలు జరపనున్నారట. ఆ తర్వాత జనసేన కార్యాలయంలో.. పవన్ కళ్యాణ్ సమక్షంలో తన అనుచరులతో కలిసి ముద్రగడ జనసేన పార్టీలో చేరుతారని జనసేన వర్గాలు అంటున్నాయి.
ఇకపోతే ముద్రగడ జనసేనలో చేరాక తనకు కుటుంబానికి రెండు టికెట్లతో పాటు.. తన అనుచరులకు కూడా టికెట్ ఇప్పించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. జనసేన తరుపున ముద్రగడ కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. లేదంటే పిఠాపురం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇక ఆయన కుమారుడు ప్రత్తిపాడు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE