తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు ముహూర్తం పెట్టేశారు అధికారులు. పోలింగ్ తేదీనూ ఎప్పుడో చెప్పేశారు. దీంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. చకచకా చర్యలు చేపడుతోంది. అయితే.. బీఆర్ ఎస్ తప్ప.. మిగతా పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఇంకా కసరత్తులు మీద కసరత్తులు చేస్తూనే ఉన్నాయి. కానీ.. బీఆర్ ఎస్ అభ్యర్థులతో పాటు, సీటు కన్ఫార్మ్ అని నిశ్చింతగా ఉన్న మిగతాపార్టీలోని నాయకులు సైతం.. ప్రచారం, నామినేషన్ల పర్వం.. తదితర ముఖ్య ఘట్టాలకు మంచి ముమూర్తాల కోసం పంతుళ్లను సంప్రదిస్తున్నారు.
తెలంగాణలో నామినేషన్లు దాఖలు ప్రక్రియ వచ్చేనెల మూడో తేదీనుంచి ప్రారంభం కానుంది. తగినంత సమయముంది. అయినప్పటికీ, ఏరోజు నామినేషన్ వేస్తే తమకు మంచిది ? ఎప్పుడు తమకు కలిసి వస్తుంది ? తమ జన్మనక్షత్రాలు, తిథులు తదితరమైనవి తెలియజేస్తూ పలువురు రాజకీయ నేతలు పండితులను సంప్రదిస్తున్నారు. ఇప్పటికే టిక్కెట్లు వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థులతోపాటు, ఇంకా టిక్కెట్లు రాని కాంగ్రెస్, బీజేపీల నేతలు కూడా వీరిలో ఉన్నారు. మంచి రోజు,తిథి, సమయం వంటివన్నీ చూసుకొని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 3 నుంచి 10వ తేదీవరకు జరగనుండగా, వాటిల్లో కొన్ని రోజులను మంచి రోజులుగా పేర్కొంటున్నారు. ఆ రోజుల్లో వారికి ముహూర్తబలం బాగుంటుందని చెబుతున్నారు.
పండితులు చెబుతున్న వివరాల మేరకు ఎక్కువమందికి మంచి రోజులుగా చెబుతున్న రోజుల వివరాలిలా ఉన్నాయి.
3వ తేదీ శుక్రవారం. శ్రీరాముని నక్షత్రం అయిన పునర్వసు ఉన్నందున ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెబుతున్నారు. నామినేషన్ల ప్రారంభం రోజుతో పాటు , శుక్రవారం కావడం వల్ల కూడా చాలామంది శుభప్రదంగా భావిస్తున్నారు.
4వ తేదీ శనివారం. సప్తమి తిథితోపాటు పునర్వసు, పుష్యమి నక్షత్రాలున్నందున దీన్ని మహారాజయోగంగా భావిస్తారని పండితులు చెబుతున్నారు. దీంతో చాలామంది ఈ రోజుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
7వ తేదీ మంగళవారం. మంగళవారాన్ని మంగళకరంగా భావించే వారు ఎందరో ఉన్నారు. నామినేషన్లకు కూడా ఆరోజు ప్రాధాన్యతనిస్తున్నవారు ఉన్నారు.
8వ తేదీ బుధవారం. దశమి తిథి గురు, కుజ బలం బాగా ఉన్న రోజుగా పండితులు చెబుతున్నారు. పుబ్బ నక్షత్రం కూడా ఉన్నందున ఎంతోమందికి కలిసి వచ్చే రోజని పేర్కొంటున్నారు.