మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు జరగబోయే ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా మరో 64 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలను కూడ అక్టోబర్ 21న నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉపఎన్నికలలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ నుంచి ఎంపీగా ఎన్నికైన పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి కూడ అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. నల్గొండ జిల్లాలోని హుజూర్నగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 2018లో జరిగిన అసెంబ్లీలో ఎన్నికలలో హుజూర్నగర్ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు, ఉపఎన్నికల్లో మరోసారి పార్టీ ఆయనకే అవకాశం ఇవ్వడం విశేషం.
మరో వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఇటీవలే హుజూర్ నగర్ అసెంబ్లీ టికెట్ ను తన సతీమణి ఉత్తమ్ పద్మావతికి కేటాయిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అయితే మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలలో అధిష్టానం ఇంకా ఎవరికీ టికెట్ కేటాయించలేదని, ఆ స్థానానికి తాను శ్యామల కిరణ్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తునట్టు తెలపడంతో వివాదం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారికంగా ఇంకా టికెట్ కేటాయిస్తున్నట్టు ఎవరి పేరు ప్రకటించలేదు.
[subscribe]