ఈ మధ్య తరచూ వినిపిస్తున్న మాట రక్తహీనత. ముఖ్యంగా మహిళలలోనే ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. శరీరంలో ఐరన్ లోపించడంతో పాటు కొన్ని ఇతర కారణాల వల్ల చాలా మందికి రక్తహీనత సమస్య వస్తుంది. ఎందుకంటే పోషకాలు ఉన్న ఆహారాన్ని వీరు పెద్దగా తీసుకోరు. కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చి ఆ తర్వాత వీరి అవసరాలు తీర్చుకోవడంతో ఆహార నియమాలు పెద్దగా పాటించరు.
అయితే రక్తహీనతతో బాధపడేవారిలో ముఖ్యంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని.. వాటితోనే పరీక్షల కంటే ముందే వారు ఎనీమియాతో బాధపడుతున్నట్లు గుర్తించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. వాటిని ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే.. రక్తహీనత నుంచి బయట పడొచ్చని అంటున్నారు.
రక్తహీనతతో బాధపడేవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాస్త దూరం నడిచినా లేదా తేలికపాటి శారీరక శ్రమ చేసినా శ్వాస తీసుకోలేక పోతుంటారు. ఇలా తరచూ అన్పిస్తూ ఉంటూ ఎనీమియా పరీక్షలు చేయించుకుని వెంటనే మందులు వాడాలి. రక్తం తక్కువగా ఉన్నవారిలో రక్తకణాల సంఖ్య తగ్గుతుంది. దీంతో చర్మం రంగు కూడా మారుతుంది.
తగినంత రక్తం శరీరంలో లేకపోతే అవయవాలకు ఆక్సిజన్ను సరఫరా చేయడానికి గుండె ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. దీనివల్ల ఛాతీ భాగంలో కొందరికి నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. గ్యాస్ లేదా గుండె జబ్బులు ఉన్నవారిలోనూ ఛాతీ నొప్పి వస్తుంది కనుక.. ఈ గుండె నొప్పికి సరైన కారణాన్ని తెలుసుకోవడానికి డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షించుకోవాలి.
రక్తహీనతతో బాధపడేవారిలో కొన్ని చిత్రమైన లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. బలపాలు, పెన్సిళ్లు, పెయింట్, గోడకు రాసిన సున్నం, మట్టి, బియ్యం వంటి పదార్థాలను తినాలనే కోరిక రక్తహీనత ఉన్నవారిలో కనిపిస్తుంది. అలాగే తరచూ తలనొప్పి వస్తున్నా రక్తహీనత కారణం అవొచ్చు. ఇలాంటివారిలో రక్తహీనత సమస్య తగ్గిపోగానే తలనొప్పి కూడా మాయం అయిపోతుంది. కనుక తరచూ తలనొప్పి వస్తుందనుకునే వాళ్లు రక్తహీనత పరీక్ష కూడా చేయించుకుంటే మంచిది.
అయితే రక్త హీనతకు చాలా ఈజీగా చెక్ పెట్టొచ్చని డాక్టర్లు అంటున్నారు. మందులు వాడాల్సిన అవసరం లేకుండానే కేవలం ఆహారం ద్వారానే ఎనీమియా నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. రక్తహీనతకు సరైన మందు మంచి ఆహారం తీసుకోవడమే అని సూచిస్తున్నారు. వీరు ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడంతో పాటు.. పొట్టుతో కూడిన ధాన్యాలు, మాంసాహారం తీసుకోవాలి. అయితే యుక్తవయసు అమ్మాయిలలో, బాలింతలో ఈ సమస్య కనిపిస్తే మాత్రం ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు వాడాలి.
ఎనీమియాతో బాధపడేవారు బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలను ప్రతి రోజూ ఉదయాన్నే తీసుకుంటూ ఉండాలి.అలాగే మొలకెత్తిన పప్పుధాన్యాలు, విటమిన్-సి ఎక్కువగా ఉండే సిట్రస్ జాతి పండ్లు అయిన జామ, ఆరెంజెస్, నిమ్మ, ఉసిరి వంటివి ఎక్కువగా తీసుకుంటే రక్తహీనతకు చెక్ పెట్టొచ్చు.
రక్తహీనత ఉన్నవారు సోయాబీన్ తీసుకోవడం చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే సోయాబీన్లు శరీరానికి కావాల్సిన పోషకాలను గ్రహించే శక్తి నిస్తాయి. బీట్రూట్లో ఐరన్, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బీట్ రూట్ తీసుకోవడం వల్ల రక్తం శుభ్రపడుతుంది.
అంతేకాదు రక్తహీనత చాలా వేగంగా తగ్గడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలలో.. నువ్వులది ప్రథమ స్థానమని చెప్పొచ్చు. అందులోనూ బెల్లంతో కలిపి వీటిని తింటే ఇంకా త్వరగా ఎనీమియా నుంచి బయటపడొచ్చు. అలాగే బెల్లంతో పాటు వేరుసెనగ పప్పు కలిసి ఉన్న పప్పుండలు వంటివి తిన్నా కూడా మంచిదే.
రక్తహీనతతో బాధపడేవారు ఐరన్,కాపర్ ,మాంగనీస్ పుష్కలంగా ఉండే తేనెను తీసుకోవాలి. అరటిపళ్లు, ద్రాక్ష, స్ట్రాబెర్రీ వంటి పండ్లు రక్తహీనతను తగ్గించడంలో ముందుంటాయి. అలాగే కిస్మిస్, ఉల్లి, క్యారట్, ముల్లంగి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE