సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ.సాయన్న (72) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సాయన్నకు ఆదివారం ఉదయం షుగర్ లెవెల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు ఆయనను సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటు రావడంతో ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఎమ్మెల్యే సాయన్న తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు. టీడీపీతో సాయన్న తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున 1994, 1999, 2004, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మరియు 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) నుంచి మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీటీడీ పాలకమండలి సభ్యుడిగా, హుడా డైరెక్టర్గా, వీధి బాలలకు పునరావాసంపై ఏర్పాటైన హౌస్ కమిటీ చైర్మన్గా కూడా సాయన్న సేవలు అందించారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న చికిత్స పొందుతూ మృతి చెందడం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, పలు పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజాసేవను, తనతో వారికున్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇక ఆదివారం సాయంత్రం ఇందిరా పార్కు వద్ద గల దివంగత సాయన్న నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకొని, సాయన్న పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం సాయన్న కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించి ఓదార్చారు. ఇక ఎమ్మెల్యే సాయన్న పార్దివ దేహన్నీ ప్రజల సందర్శనార్ధం సోమవారం ఉదయం 10.00 గంటల నుంచి ఖర్ఖానాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.00 గంటలకు మారేడుపల్లిలోని హిందూ శ్మశానవాటికలో సాయన్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE