టీ-కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. నల్గొండ జిల్లాలోని అభివృద్ధి పనులకు సంబంధించి ఆయన ప్రధానిని అపాయింట్మెంట్ కోరగా.. శుక్రవారం ఉదయం 11 గంటలకు కలవాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అనుమతి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంటులోని ప్రధాని మోదీ కార్యాలయంలో కోమటిరెడ్డి కలవనున్నారు. గంగానది తరహాలో మూసీ నదిని ప్రక్షాళన చేయాలని, దీనిలో భాగంగా ‘నమామి మూసీ’ కార్యక్రమం నిర్వహించాలని ప్రధానిని కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే నల్గొండలోని పరీవాహక ప్రాంత అభివృద్ధి మరియు నది ప్రక్షాళన కోసం రూ.3వేల కోట్లు నిధులు మంజూరు చేయాల్సిందిగా ఆయన ప్రధానిని కోరనున్నట్లు సమాచారం. దీనితో పాటు తెలంగాణలోని రాజకీయ పరిస్థితుల గురించి కూడా ప్రధాని మోదీతో ఆయన చర్చించనున్నట్లు కోమటిరెడ్డి అనుచరులు పేర్కొన్నారు.
కాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గత కొంత కాలంగా టీపీసీసీ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఆయన సొంత పార్టీ నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిందిగా పార్టీ శ్రేణులను కోరినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక డిసెంబర్ 10వ తేదీన ఏర్పాటు చేసిన పీసీసీ కమిటీల్లో కూడా ఆయనకు చోటులేకపోవడం కొంత చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేపు ప్రధాని మోదీతో భేటీ కానుండటం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. కాగా ఎంపీ వెంకట్ రెడ్డి బుధవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ