ఆంధ్రప్రదేశ్ అగ్రపథాన నిలిచిన నాడే పొట్టి శ్రీరాములుకి నిజమైన నివాళి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి (డిసెంబర్ 15) సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. “సంకల్పం బలంగా ఉన్నప్పుడు, లక్ష్యం ప్రజా ప్రయోజనం అయినప్పుడు, నీ వెంట ఒక్కడూ లేకున్నా…ఒక్కడూ రాకున్నా విజయం సిద్ధించటం తధ్యమని శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు నిరూపించి చూపారు. తెలుగు మాట్లాడేవారంతా తెలుగుతల్లి నీడలో ఒక రాష్ట్రంగా కలిసిమెలిసి జీవించాలని తపించి తపించి తన ప్రాణాలను పణంగా పెట్టి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి కారకుడైన ఆ అమరజీవి వర్ధంతి సందర్భంగా నా పక్షాన జనసేన శ్రేణుల పక్షాన ముకుళిత హస్తాలతో నీరాజనాలు అర్పిస్తున్నాను. త్యాగనిరతి మూర్తీభవించిన శ్రీరాములు పాతికేళ్ల ప్రాయంలోనే భార్య, కుమారుడ్ని కోల్పోయి సంఘజీవిగా మారిపోయి తన జీవితాన్ని దేశం కోసం అర్పించుకోవడం ఆయనలోని త్యాగశీలతను ఈ ప్రపంచానికి చాటుతుంది. సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ శిష్యునిగా సేవలందిస్తున్న సమయంలో ‘శ్రీరాములు వంటి వారు మరో పదిమంది నాపక్కన ఉంటే ఈ దేశానికి ఇంకా ముందే తీసుకొచ్చేవాడిని అని మహాత్ముడు వ్యాఖ్యానించడం శ్రీరాములులోని దీక్షాదక్షతలు ఏ పాటివో అవగతమవుతాయి” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
“పొట్టి శ్రీరాములుకి నిరాహారదీక్షలు కొత్తేమీ కావు. మద్రాస్ ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోకి హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆయన కఠోర దీక్ష చేసి ఉన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలుగువాడికి ఒక జాతిగా గుర్తింపు లేక మద్రాసీలు అని పిలుపును సహించలేక ఒక్కడుగా నిరాహార దీక్షను ప్రారంభించి 58 రోజుల పాటు కఠోరంగా దీక్షను కొనసాగించి చివరికి ప్రాణాలు అర్పించారు. ఐదుపదుల వయస్సు నిండకుండానే తెలుగువారి కోసం తాను వెలుగుదివ్వెగా మారారు. ఇంతటి త్యాగ నిరతితో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ను రక్షించుకునే అవకాశం విజ్ఞులైన ప్రజల చేతిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధితో వెలుగొందుతూ అగ్రపథాన పయనించినప్పుడే అమరజీవి పొట్టి శ్రీరాములుకి నిజమైన నివాళి” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE