తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మాజీ వైస్ చైర్మన్ మరియు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా అనుబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఆయన తార్నాకలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనిపై అధికారికంగా ప్రకటన చేశారు. చాలా బాధతో కాంగ్రెస్ పార్టీతో ఉన్న బంధాన్ని తెంచుకుంటున్నానని తెలిపిన ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మరియు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపినట్లు వెల్లడించారు. తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోందని, అధికార టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో విఫలమవుతోందని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం కోల్పోయిందని, శ్రేణులను సరైన దిశలో నడిపించే నాయకత్వం లేదని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని స్ఫష్టం చేశారు. పార్టీకోసం కష్టపడేవారిని గుర్తించడం లేదని, అలాగే పార్టీలో సీనియర్లకు ఎలాంటి గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ బాగుండాలనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇకపై పార్టీలో కొనసాగలేనని తేల్చి చెప్పారు. ఇక తాను త్వరలో బీజేపీలో చేరనున్నట్లు తెలిపిన శశిధర్ రెడ్డి ఈనెల 25 లేదా 26 తేదీల్లో ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. మైనారిటీల అభివృద్ధికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని, బీజేపీ మాత్రమే వారి అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. ఈ విషయాన్ని తాను దగ్గరగా గమనించానని, బీజేపీ నేతృత్వంలో దేశం ప్రగతి వైపు పరుగులు పెడుతోందని అన్నారు.
ఇక గత కొంతకాలంగా శశిధర్ రెడ్డి పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) చీఫ్ ఎ రేవంత్ రెడ్డిపై కూడా పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి కేన్సర్ సోకిందని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం సృష్టించాయి. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ ఆరేళ్ల పాటు బహిష్కరించింది. ఈ నెల 11న దేశ రాజధానిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అవడం తెలంగాణ కాంగ్రెస్ లో అలజడి రేపింది. ఈ నేపథ్యంలో శశిధర్రెడ్డిని టీపీసీసీ క్రమశిక్షణ చర్య కమిటీ బహిష్కరించింది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత మర్రి చెన్నారెడ్డి కుమారుడే మర్రి శశిధర్ రెడ్డి అన్న సంగతి తెలిసిన విషయమే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE