ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్గార్ మేళా కింద కొత్తగా నియమితులైన 71,056 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశంలోని 45కి పైగా నగరాల్లో 71,056 మంది యువతకు అపాయింట్మెంట్ లెటర్స్ అందజేస్తున్నామని, దీని ఫలితంగా చాలా కుటుంబాల్లో సంతోషకరమైన కొత్త శకం ఏర్పడుతుందని అన్నారు. ధన్తేరస్ రోజున కేంద్ర ప్రభుత్వం యువతకు 75 వేల నియామక పత్రాలను పంపిణీ చేసిందని గుర్తు చేశారు. “దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ మోడ్లో పని చేస్తుందనడానికి నేటి రోజ్గార్ మేళా నిదర్శనం” అని ప్రధాని అన్నారు.
నెల రోజుల క్రితం రోజ్గార్ మేళా ప్రారంభించిన విషయాన్ని ప్రధాని గుర్తు చేస్తూ, అనేక కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు రాష్ట్రాలు ఎప్పటికప్పుడు ఇటువంటి రోజ్గార్ మేళాలను నిర్వహిస్తూనే ఉంటాయని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, చండీగఢ్లలో ఆయా ప్రభుత్వాలు వేలాది మంది యువతకు నియామక పత్రాలు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మరికొన్ని రోజుల్లో గోవా, త్రిపురలు కూడా ఇలాంటి రోజ్గార్ మేళాలను నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు. దేశంలోని యువతకు సాధికారత కల్పించడానికి ఎప్పటికప్పుడు ఇటువంటి ఉపాధి మేళాలను నిర్వహిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
అలాగే ఈరోజు ప్రారంభించిన కర్మయోగి భారత్ టెక్నాలజీ ప్లాట్ఫారమ్ గురించి మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారుల కోసం అనేక ఆన్లైన్ కోర్సుల లభ్యతను ప్రధాని తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం రూపొందించిన కర్మయోగి ప్రారంభ్ అనే ప్రత్యేక కోర్సును గురించి చెప్తూ, కొత్తగా నియమితులైనవారు దానిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇది వారి నైపుణ్యాభివృద్ధికి గొప్ప మూలాధారం అవుతుందని, అలాగే రాబోయే రోజుల్లో వారికి ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధాని అన్నారు.
యువతే దేశానికి అతిపెద్ద బలం అని ప్రధాని మోదీ అన్నారు. వారి ప్రతిభను, శక్తిని దేశ నిర్మాణానికి వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వోద్యోగులను అభినందించారు. వారు ఈ ముఖ్యమైన బాధ్యతను చాలా ప్రత్యేకమైన కాలంలో, అంటే అమృత్ కాల్లో స్వీకరిస్తున్నారని గుర్తు చేశారు. దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలనే సంకల్పంలో వారి పాత్రను ఆయన అమృత్ కాల్లో హైలైట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా వారు తమ పాత్రను, విధులను సమగ్రంగా అర్థం చేసుకోవాలని, తమ విధులను నిర్వర్తించే సామర్థ్యాన్ని పెంపొందించడంపై నిరంతరం దృష్టి సారించాలని ప్రధాని కోరారు.
కోవిడ్ మహమ్మారి మరియు యుద్ధం కారణంగా ప్రపంచ స్థాయిలో యువతకు ఏర్పడిన సంక్షోభాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ క్లిష్ట సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు కూడా భారతదేశ వృద్ధి పథం గురించి ఆశాజనకంగా ఉన్నారని అన్నారు, నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారతదేశం సేవా రంగంలో ప్రధాన శక్తిగా మారిందని, త్వరలో ఇది ప్రపంచంలోని తయారీ కేంద్రంగా కూడా అవుతుందని అన్నారు. పిఎల్ఐ వంటి కార్యక్రమాలు ఇందులో భారీ పాత్ర పోషిస్తాయని, దేశంలోని యువత మరియు నైపుణ్యం కలిగిన మానవశక్తి ప్రధాన పునాది అని ప్రధాని అన్నారు. పీఎల్ఐ పథకం ద్వారా 60 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని ప్రధాని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ మరియు స్థానికంగా, ప్రపంచవ్యాప్తంగా, ఉపాధి మరియు స్వయం ఉపాధి కోసం కొత్త అవకాశాలను సృష్టిస్తున్నట్లు ఆయన తెలిపారు. “ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో కొత్త ఉద్యోగాల అవకాశం నిరంతరం పెరుగుతోంది. మరీ ముఖ్యంగా వారి స్వంత నగరాలు మరియు గ్రామాలలోని యువతకు ఈ అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. దీంతో యువత వలసల ఒత్తిడి తగ్గిందని, తమ ప్రాంత అభివృద్ధిలో తమ పాత్రను పోషించగలుగుతున్నారు” ప్రధాని మోదీ చెప్పారు.
రోజ్గార్ మేళా అనేది ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రధాని మోదీ యొక్క నిబద్ధత నెరవేర్చే దిశగా ఒక అడుగని పేర్కొన్నారు. రోజ్గార్ మేళా మరింత ఉపాధి కల్పనలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని మరియు యువతకు వారి సాధికారత మరియు జాతీయ అభివృద్ధిలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి అర్ధవంతమైన అవకాశాలను అందించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే అక్టోబర్లో రోజ్గార్ మేళా కింద కొత్తగా చేరిన 75,000 మందికి నియామక పత్రాలు అందజేశారు. తాజాగా కొత్తగా నియమితులైన వారికి అపాయింట్మెంట్ లెటర్స్ యొక్క ఫిజికల్ కాపీలు దేశవ్యాప్తంగా 45 ప్రదేశాలలో (గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ మినహా) అందజేశారు. గతంలో భర్తీ చేసిన పోస్టుల కేటగిరీలతో పాటు టీచర్లు, లెక్చరర్లు, నర్సులు, నర్సింగ్ ఆఫీసర్లు, డాక్టర్లు, ఫార్మసిస్టులు, రేడియోగ్రాఫర్లు, ఇతర టెక్నికల్, పారామెడికల్ పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. వివిధ కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో (సీఏపీఎఫ్) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణనీయమైన సంఖ్యలో పోస్టులను భర్తీ చేస్తోంది.
మరోవైపు కర్మయోగి ప్రారంభ్ మాడ్యూల్ను కూడా నేడుప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ మాడ్యూల్ అనేది వివిధ ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా నియమితులైన వారందరికీ ఆన్లైన్ ఓరియంటేషన్ కోర్సు. ఇందులో ప్రభుత్వోద్యోగుల ప్రవర్తనా నియమావళి, కార్యాలయ నీతి మరియు సమగ్రత, మానవ వనరుల విధానాలు, ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు ఉంటాయని, ఇవి విధానాలకు అలవాటు పడటానికి మరియు కొత్త పాత్రలలోకి సజావుగా మారడానికి సహాయపడతాయని చెప్పారు. అలాగే వారు జ్ఞానం, నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి igotkarmayogi.gov.in ప్లాట్ఫారమ్లో ఇతర కోర్సులను అన్వేషించే అవకాశాన్ని కూడా పొందుతారని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE