అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి తన కార్యాలయంలోనే ఓ దుండగుడి చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో మంటల్లో చిక్కుకున్న తహసీల్దార్ విజయారెడ్డిని రక్షించే ప్రయత్నం చేసిన ఆమె కారు డ్రైవర్ గురునాథం కూడ మంగళవారం నాడు ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం నాడు దుండగుడి దాడిలో సజీవ దహనమవుతున్న విజయారెడ్డిని రక్షించేందుకు గురునాథ్ తీవ్రంగా ప్రయత్నించిన క్రమంలో దాదాపు 80 శాతం కాలిపోయిన ఆయన్ను వెంటనే అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా వైద్యులు వెల్లడించారు.
సూర్యాపేట జిల్లాలోని గరిడేపల్లి మండలం వెల్దండ గ్రామానికి చెందిన కామళ్ల గురునాథం గత ఐదు సంవత్సరాలుగా తహసీల్దార్ కార్యాలయంలో డ్రైవరుగా విధులు నిర్వర్తిస్తున్నారు. గురునాథానికి మూడేళ్ల కిందట వివాహమవగా, భార్య సౌందర్యతోపాటు సంవత్సరంన్నర వయసున్న కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం గురునాథం భార్య గర్భవతి కావడంతో ఆమె పుట్టింటి వద్ద ఉన్నారు, విషయం తెలుసుకుని హైదరాబాద్ చేరుకున్న కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మరోవైపు తహసీల్దార్ విజయారెడ్డి మృతదేహానికి ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్మార్టం పూర్తి చేశారు. ఆమె అంత్యక్రియలు మంగళవారం నాడు జరగనున్నాయి. నాగోల్ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
[subscribe]