తెలంగాణ అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఈ రోజు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7 న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎనిమిది రోజు సమావేశాలు ముగిసిన అనంతరం వాయిదా వేస్తునట్టుగా స్పీకర్ ప్రకటించారు. ముందుగా వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ 28 వరకు కొనసాగించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఇద్దరు ఎమ్మెల్యేలకు, అసెంబ్లీ సిబ్బంది, విధులు నిర్వహించే కొంతమంది పోలీసులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అన్ని పార్టీల సభ్యుల సూచనల మేరకు సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ పేర్కొన్నారు. సభ్యులంతా కరోనా నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహణకు సహకరించినందుకు స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు.
ఎనిమిది రోజులు పాటుగా సాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రెవెన్యూ బిల్లు, టిఎస్ బీపాస్ బిల్లు సహా మొత్తం 12 బిల్లులపై కీలకంగా చర్చించి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలు, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీర్మానం, కేంద్ర విద్యుత్ బిల్లు ఉపసంహరణ తీర్మానం, సింగరేణి సమస్యలు సహా పలు అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu