ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనికా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ వేయించుకున్న ఓ వాలంటీరుకు అనారోగ్య సమస్యలు తలెత్తిన నేపథ్యంలో, వ్యాక్సిన్ పై మరోసారి సమీక్ష నిర్వహించేందుకు ట్రయల్స్ నిలిపివేశారు. అయితే బ్రిటిష్ రెగ్యులేటర్స్ నుంచి అన్ని అనుమతులు రావడంతో క్లినికల్ ట్రయల్స్ తిరిగి ప్రారంభించినట్టు ఆస్ట్రాజెనెకా సంస్థ వెల్లడించింది. వ్యాక్సిన్ భద్రతపై ఓ కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపారు. దర్యాప్తు జరిపిన కమిటీ ఈ వ్యాక్సిన్ సురక్షితమేనని, ట్రయల్స్ తిరిగి ప్రారంభించవచ్చని మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ(ఎంహెచ్ఆర్ఏ) కు సిఫార్సు చేసింది. దీంతో బ్రిటన్లో క్లినికల్స్ ట్రయల్స్ని మళ్ళీ ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో దేశంలో కూడా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ తిరిగి ప్రారంభించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) కు అనుమతినిచ్చింది. ఇటీవల క్లినికల్ ట్రయల్స్ నిలిపివేయాలని ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు. అయితే స్క్రీనింగ్ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని, ఈ ట్రయల్స్ ను కొనసాగించాలని సూచించారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తినా, వాటిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సీరం ఇన్స్టిట్యూట్ను డీసీజీఐ ఆదేశించింది. ఇటీవల క్లినికల్ ట్రయల్స్ పై సీరం ఇన్స్టిట్యూట్ సమర్పించిన వివరాలు పరిశీలన, బ్రిటన్, భారత్ డీఎస్ఎంబీ సిఫార్సుల తర్వాత దేశంలో మళ్ళీ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి ఇచ్చినట్టు డీసీజీఐ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu