తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు (మార్చ్ 6, శుక్రవారం) ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమయిన వెంటనే అసెంబ్లీకి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ శాసనసభ, శాసనమండలిలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రసంగించారు. గవర్నర్ తమిళిసై ఉభయసభలనుద్దేశించి ప్రసంగించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రము అతి తక్కువ కాలంలోనే అనేక రంగాల్లో అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. సరికొత్త ప్రణాళికలతో సీఎం కేసీఆర్ అనేక సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఆత్మహత్యలు, వలసలు, విద్యుత్, నీరు, ఎరువుల సమస్యలుతో రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేవారని, సీఎం కేసీఆర్ చేసిన కృషితో, ప్రవేశ పెట్టిన పథకాలు, సాగునీటి ప్రాజెక్టులతో ప్రస్తుతం తెలంగాణ ప్రగతిపథంలో దూసుకెళ్తుందని చెప్పారు.
ఇక మార్చ్ 7వ తేదీన గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లోనూ చర్చ జరుగనుంది. 2020-21 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మార్చ్ 8 లేదా 10వ తేదీల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) మీటింగ్ లో చర్చించి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజుతో పాటుగా, బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజుల పాటుగా నిర్వహించాలో కూడా నిర్ణయించనున్నారు. ఈసారి ఆర్థిక మంత్రి హోదాలో హరీష్ రావు మొదటిసారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు, అలాగే శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెడతారు.
[subscribe]