తెలంగాణ శాసనసభ ఆఖరి రోజు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ తీర్మానంపై సీఎం కేసీఆర్, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు మాట్లాడారు. అనంతరం సీఏఏ వ్యతిరేక తీర్మానం శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
సీఏఏ వ్యతిరేక తీర్మానం సభలో ప్రవేశ పెట్టిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, సీఏఏ బిల్లును పార్లమెంట్లోనే టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించిందని తెలిపారు. ఇప్పటి వరకు కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భిన్న సంస్కృతులతో పాటుగా కాస్మోపాలిటన్ కల్చర్ కలిగి ఉన్న తెలంగాణ రాష్ట్రం సీఏఏపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. సీఏఏపై దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆందోళన వ్యక్తమవుతోందని, దీంతో ప్రభుత్వ వైఖరేంటో చెప్పాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు. తాము గుడ్డిగా వ్యతిరేకించడం లేదని, పూర్తి స్పష్టమైన అవగాహనతోనే సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ను వ్యతిరేకిస్తున్నామని సీఎం కేసీఆర్ సభలో ప్రకటించారు. దేశంలో ఆందోళనలకు కారణమవుతున్న సీఏఏని పునఃసమీక్షించాలని సీఎం కేసీఆర్ స్పీకర్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
” పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం నాకే లేదని, అలాంటప్పుడు మా నాన్నది తేవాలంటే ఎక్కడి నుంచి తేవాలని” సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. సీఏఏని ఏంతో మంది మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, నిపుణులు, కవులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇలాంటి నిర్ణయాలు విభజన రాజకీయాలకు దారితీస్తాయని, ఈ పరిస్థితులు మన దేశానికి అవసరమా అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. మరోవైపు మార్చ్ 6న ప్రారంభమైన తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలను మార్చ్ 20వ తేదీ వరకు కొనసాగించాలని నిర్ణయించగా, కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నాలుగు రోజుల ముందే సమావేశాలు ముగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
[subscribe]