2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులకు మార్చి 20, 2020వ తేదీ ఉదయం 5:30 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఉరిశిక్షను అడ్డుకునేందుకు దోషులు వివిధ రకాల ప్రయత్నాలు చేయడంతో ఉరిశిక్ష అమలు మూడు సార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో నిర్భయ దోషులు మరోసారి అలాంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీరిలో ముగ్గురు దోషులు తమ ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) ఆశ్రయించారు. ఉరిశిక్షపై స్టే కోరుతూ అక్షయ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ ఐసీజేలో పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. దోషులు ఐసీజేను ఆశ్రయించడంతో మార్చి 20న ఉరిశిక్ష అమలుపై మరోసారి సందేహాలు మొదలయ్యాయి.
మరోవైపు నలుగురు దోషులల్లో ఒకరైన ముకేశ్ కుమార్ ఉరి శిక్ష అమలుపై తనకున్న న్యాయపరమైన అవకాశాలను పునరుద్ధరించాలని కోరుతూ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అతని అభ్యర్ధనను ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతేగాక తమ కారుణ్య మరణానికి అనుమతివ్వాలని కోరుతూ నిర్భయ దోషుల కుటుంబ సభ్యులు మార్చ్ 15, ఆదివారం నాడు రాష్ట్రప్రతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాశారు. ప్రతీకారమే శక్తికి నిర్వచనం కాదని, క్షమాగుణంలో కూడా శక్తి ఉంటుందని వారు లేఖలో పేర్కొన్నారు. కారుణ్య మరణానికి అనుమతి కోరిన వారిలో నిర్భయ దోషుల తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.