తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఏడాది ముందు నుంచే నాటి అధికార పార్టీ బీఆర్ ఎస్ తో ఢీ అంటే ఢీ అంటూ దూసుకెళ్లింది భారతీయ జనతా పార్టీ. అప్పటి అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన పాదయాత్ర కూడా ఆ పార్టీ మైలేజీని పెంచింది. వ్యూహం ఏంటో తెలియదు కానీ.. పార్టీ మంచి ఫాంలో ఉన్న సమయంలో బండిని అధిష్ఠానం తప్పించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించింది. అప్పటి నుంచీ పార్టీలో సీన్ రివర్స్ అయింది. కాషాయ పార్టీ లో స్పీడ్ తగ్గింది. దీంతో కాంగ్రెస్ పుంజుకుంది. కట్ చేస్తే.. ఏకంగా అధికారంలోకి వచ్చి కూర్చుంది. ఇప్పుడు అసెంబ్లీ కథ ముగిసింది.. త్వరలో లోక్ సభ సమరం మొదలుకానుంది. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావాలంటే తెలంగాణ చాలా ముఖ్యం. దీంతో పార్టీలో మళ్లీ జోష్ పెంచాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు.
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం టార్గెట్ పెట్టింది. అందుకు అవసరమైన కార్యాచరణను కేంద్ర హోంమంత్రి అమిత్షా పర్యవేక్షిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆయన హైదరాబాద్ వచ్చి రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలు, వివిధ నియోజకవర్గాల సీనియర్ నేతలతో సమావేశం అయ్యారు. త్వరలోనే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తెలంగాణకు రానున్నారు. అయితే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తలెత్తిన కొన్ని ఇబ్బందికర పరిణామాల నేపథ్యంలో ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అంశాన్ని అమిత్ షా సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి అభ్యర్థుల ఎంపిక లో పక్యా వ్యూహాలను పార్టీ అవలంబించే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీలను రంగంలోకి దింపి పార్టీ ఓట్లను పెంచుకున్న బీజేపీ.. ఈసారి రాజ్యసభ సభ్యులను ప్రజాక్షేత్రంలో పోటీ చేయించే అవకాశం ఉంది.
మరోవైపు.. ఎంపీ టికెట్ల కోసం కొంతమంది సీనియర్ నాయకులు, జాతీయ నాయకత్వానికి వినతులు సమర్పిస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత మంది కాంగ్రెస్కు మద్దతుగా ప్రచారం చేశారని, అందువల్లే కొన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదని ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. టికెట్ల కేటాయింపులో గందరగోళం సృష్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పలువురు సీనియర్ నాయకులు బీజేపీ నాయకత్వాన్ని కోరారు. ‘‘గతంలో ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో గందరగోళం సృష్టించిన వారు ఇప్పుడు ఎంపీ టికెట్ల విషయంలోనూ అలాగే చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాళ్లతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. అధికారంలోకి వస్తుందనుకున్న పార్టీని దారుణంగా దెబ్బతీశారు. వారి పట్ల స్థానిక క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ అవసరాల కోసం పార్టీని వాడుకునే వారితో పాటు పార్టీలు మారే వారి పట్ల నాయకత్వం అప్రమత్తంగా ఉండాలి. పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలను విమర్శించిన వారికి టికెట్లు ఇవ్వొద్దు. స్థానిక క్యాడర్ కోరుకుంటున్న వారికి, పార్టీ జెండా కోసం పని చేసిన వారికే అవకాశం ఇవ్వాలి’’ అంటూ అధిష్ఠానికి వినతులు, ఫిర్యాదులు చేస్తున్నారు.
ఆశావహులు టికెట్ కోసం ఇప్పటి నుంచే ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. తమ బాస్లను కలిసి హామీ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీని మళ్లీ ఫాంలోకి తెచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం చేస్తున్న కృషికితోడు.. మోదీ హవా నేపథ్యంలో గెలుపు తథ్యమని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గం పరిధిలోని పలువురు సీనియర్ నాయకులు ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్రనేతలను కలిసి ఈ మేరకు టికెట్ కోసం అభ్యర్థిస్తున్నారు. పార్టీని మళ్లీ ఫాంలోకి తెచ్చిన వారికే అవకాశాలు ఉంటాయని తాజాగా నేతలతో భేటీ అయిన అమిత్ షా స్పష్టం చేశారు. ఈ క్రమంలో పార్టీలో జోష్ పెంచేందుకు అగ్రనాయత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ