దేశంలోని 15 రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు-2022 కోసం భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ముందుగా 9 రాష్ట్రాలకు సంబంధించి 18 అభ్యర్థులతో తోలి జాబితా ప్రకటించగా, సోమవారం మధ్యప్రదేశ్, కర్ణాటక మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి మరో నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కు చోటు దక్కింది. తెలంగాణకు చెందిన డా.కె.లక్ష్మణ్ ను బీజేపీ అధిష్టానం ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ బరిలోకి దింపింది. మరోవైపు రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసేందుకు నేడే చివరి రోజు (మే 31) కావడంతో, నేడు కె.లక్ష్మణ్ లక్నో చేరుకుని నామినేషన్ వేయనున్నారు.
ఇక బీజేపీ రెండో జాబితాలో ఉత్తరప్రదేశ్ నుంచి లక్ష్మణ్ తో పాటుగా నుంచి మిథిలేష్ కుమార్, మధ్యప్రదేశ్ నుంచి సుమిత్ర వాల్మీకి, కర్ణాటక నుంచి లహర్ సింగ్ సరోయ పేర్లను ప్రకటించారు. కాగా కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బార్ నఖ్వీకి ఈ రెండు జాబితాల్లోనూ చోటు దక్కలేదు. ఆయన రాజ్యసభ పదవీకాలం జులైలో ముగియనుంది. కేంద్ర మంత్రివర్గంలో కొనసాగాలంటే పార్లమెంటులో ఏదో ఒక సభలో సభ్యునిగా ఉండాలనే నిబంధన ఉన్నందువలన నఖ్వీ విషయంలో బీజేపీ అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ రాజ్యసభ ఎన్నికలకు జూన్ 1న నామినేషన్ల పరిశీలన జరగనుండగా, జూన్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఇక జూన్ 10వ తేదీన ఎన్నికలు జరుగుతాయని, ఓట్ల లెక్కింపు పక్రియ కూడా అదే రోజున జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF