తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే.లక్ష్మణ్ ఆగస్టు 6 మంగళవారం నాడు, నల్గొండలో జరుగుతున్న బీజేపీ సభ్యత్వ స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వ స్వీకరణకు ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు అంతా సిద్ధమవుతుందని, ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వాన్ని బలపరిచేందుకు ప్రజలు సిద్దమయి ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణాలో అవినీతి రహిత, కుటుంబ రహిత పాలన కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమని చెప్పారు.
నల్గొండ జిల్లాలో ముఖ్య కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరడం ఖాయమని చెప్పారు. ఇంకా ఇతర పార్టీలకు చెందిన నేతలు సైతం బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని త్వరలోనే అన్ని విషయాలు వివరిస్తామని చెప్పారు. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్-370 రద్దు చేస్తూ బీజేపీ చారిత్రాత్మిక నిర్ణయం తీసుకుందని, దేశ ప్రజలందరూ స్వాగతిస్తున్నారని చెప్పారు. ఆగస్టు 5, 2019 చరిత్ర తిరగ రాసిన రోజు అని కే.లక్ష్మణ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కశ్మీర్ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని, జమ్మూ కశ్మీర్ విభజన బిల్లుకు మద్ధతు ఇవ్వని పార్టీలను దేశ ప్రజలు క్షమించరని చెప్పారు.
[subscribe]
[youtube_video videoid=cPNS0gog3TE]