తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు:
- మే 20వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది.
- చెన్నూరు నియోజకవర్గంలోని 5 మండలాలలోని 103 గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందించే ‘చెన్నూరు ఎత్తిపోతల పథకానికి’ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.1658 కోట్లు మంజూరు చేసింది. 10 టిఎంసీల గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఈ పథకానికి వినియోగించనున్నారు.
- పార్వతీ బ్యారేజ్ జలాశయం నుంచి జైపూర్, మందమర్రి మండలాల్లో 25,423 ఎకరాలకు, సరస్వతి బ్యారేజ్ జలాశయం నుంచి చెన్నూరు, భీమారం, కోటపల్లి మండలాల్లో 48,208 ఎకరాలకు, లక్ష్మీబారేజీ జలాశయం నుంచి కోటపల్లి మండలంలో 16,370 ఎకరాలకు మొత్తంగా 90,000 ఎకరాలకు ఈ పథకం ద్వారా సాగునీరు అందనున్నది.
- ఈ యాసంగి సీజన్ లో రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం. క్వింటాల్ కు రూ.1960 చొప్పున చెల్లింపు. రేపటినుంచే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం.
- ఆదివాసి, గిరిజన ప్రాంతాలైన ఆసిఫాబాద్, సారపాక, భద్రాచలం గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా ఉన్నతీకరించాలనే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం
- విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకం: ఇక నుండి విశ్వవిద్యాలయాల సిబ్బంది నియామకాలు ఒకే ఒక నియామక సంస్థ (కామన్ రిక్రూట్ మెంట్ బోర్డ్) ద్వారా జరపాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయించింది. ప్రస్తుతం ఏ విశ్వవిద్యాలయానికి ఆ విశ్వవిద్యాలయమే సిబ్బంది నియామకాలను చేపట్టే పద్ధతి అమలవుతున్నది. అందుకు భిన్నంగా ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధంగా అన్ని విశ్వవిద్యాలయాల సిబ్బంది నియామకాన్ని పారదర్శకంగా ఒకే నియామక సంస్థ ద్వారా జరపాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 3,500 పై చిలుకు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను చేపట్టాలని కేబినేట్ నిర్ణయించింది. రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కూడా రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ