తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు (ఫిబ్రవరి 16, ఆదివారం) సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈమేరకు సమావేశానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రగతిభవన్లో జరగబోయే ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కొత్త రెవెన్యూ చట్టం, త్వరలో ప్రభుత్వం చేపట్టబోయే పట్టణ ప్రగతి కార్యక్రమంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే బడ్జెట్ సమావేశాల నిర్వహణ, కేటాయింపులుపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల కాళేశ్వరం పర్యటన సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షలో సాగునీటి ఇంజినీరింగ్ వ్యవస్థను 11 సర్కిల్స్గా విభజించనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విద్య, ఉపాధి పేరిట విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడే తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఎన్.ఆర్.ఐ విధానం రూపకల్పనపై కూడా చర్చ జరిగే అవకాశమునట్టు తెలుస్తుంది.
[subscribe]