తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జనవరి 1, బుధవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ దాదాపు 3 గంటల పైగా వివిధ అంశాలపై చర్చించారు. పభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణను ఈ భేటీలో సీఎం కేసీఆర్ గవర్నర్ కు వెల్లడించినట్టు తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంపై సమగ్ర నివేదిక గవర్నర్ కు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టుల గురించి కూడా సీఎం వివరించినట్లు తెలుస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన సోమేశ్ కుమార్ కూడా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలుసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.
మరోవైపు నూతన సంవత్సర సందర్భంగా పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు కే.కేశవ్ రావు, పార్టీ లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వరరావు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పి చైర్పర్సన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డిజిపి ఎం.మహేందర్ రెడ్డి, పలువురు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు, జెన్కో ట్రాన్స్కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు, టిపిపిఎస్సి చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, పలు కార్పొరేషన్లు, కమిషన్ చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు, తదితరులు ఉన్నారు.
[subscribe]