తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన రెవెన్యూ విధానంలో భాగంగా రూపకల్పన చేసిన ధరణి పోర్టల్ ను ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్ లో ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 55 రోజులగా నిలిచిపోయిన భూముల రిజిస్ట్రేషన్లు మళ్లీ మొదలయ్యాయి. అయితే ధరణి పోర్టల్ ద్వారా ప్రస్తుతానికి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మరియు మ్యుటేషన్లను మాత్రమే ప్రారంభించారు. రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు ఇంకా కొన్ని రోజుల సమయం పట్టే అవకాశమునట్టు సమాచారం.
హైదరాబాద్ పరిధిలోని 20 మండలాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల ధరణి సేవలు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 570 తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి సేవలకు ఏర్పాట్లు చేశారు. కొత్త రెవెన్యూ విధానంలో భాగంగా ప్రభుత్వం తహసీల్దార్లుకు సబ్ రిజిస్టర్లుగా అధికారం ఇచ్చింది. ముందుగా అరగంట కొకటి చొప్పున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలవరకు స్లాట్స్ కేటాయించనున్నారు. అలాగే మీ-సేవా కేంద్రాల ద్వారా స్లాట్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. పది పత్రాలలో కూడిన స్లాట్కు ధరను రూ.200 గా నిర్ణయించారు. పది పత్రాల అనంతరం ప్రతి పత్రానికి రూ.5 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ ద్వారా కేవలం అరగంట వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ మరియు మ్యుటేషన్ పక్రియ పూర్తికానుంది. అనంతరం వారం నుంచి పది రోజుల సమయంలోనే పాస్ పుస్తకం నేరుగా ఇంటికే చేరనుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ