రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం, లాక్డౌన్ అమలుపై ఏప్రిల్ 6, సోమవారం సాయంత్రం ప్రగతి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, కెటి.రామారావు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏప్రిల్ 15 తర్వాత కూడా లాక్డౌన్ కొనసాగించాలని కోరుకుంటున్నానని, ఇదే విషయాన్నిప్రధాని నరేంద్ర మోదీకి కూడా చెప్పానని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:
- తెలంగాణలో 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. వీరిలో11 మంది మృతి చెందగా 45 మంది కోలుకున్నారు. 308 మంది చికిత్స పొందుతున్నారు.
- అమెరికాకు చెందిన ప్రముఖ సర్వే సంస్థ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) భారత్లో జూన్ 3 వరకు లాక్డౌన్ కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొంది.
- ఏప్రిల్ 15 తర్వాత కూడా దేశంలో లాక్డౌన్ కొనసాగింపుకే నా మద్దతు. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఇదే విషయం చెప్పా.
- దేశానికి ఆర్థికంగా నష్టం జరిగితే మళ్ళీ కోలుకోగలం కానీ ప్రజల ప్రాణాలు పోతే వెనక్కి తీసుకుని రాలేం.
- దేశంలో సదుపాయాలు, వైద్యులు, సిబ్బంది కొరత ఉన్న పరిస్థితిల్లో మనం ఈ వైరస్ను ఎదుర్కోలేం.
- ఎంతో అభివృద్ధి చెందిన దేశాలే ఈ వైరస్ వలన అతలాకుతలం అవుతున్నాయి.
- కరోనా వైరస్ ఎదుర్కోవడానికి మనకు లాక్డౌన్ ఒక్కటే ఆయుధం.
- ఎలాంటి అనుమానాలు లేకుండా లాక్డౌన్ను పొడిగించాలని ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రత్యేకంగా చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలి.
- ఢిల్లీ నిజాముద్దీన్ ఘటన లేకుంటే తెలంగాణలో పరిస్థితి ఆరామ్గా ఉండేది.
- కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయితే లక్షాధికారులైనా, కోటీశ్వరులైనా గాంధీ ఆసుపత్రిలో ఉండాల్సిందే.
- తెలంగాణాలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదు.
- ప్రస్తుత పరిస్థితుల్లో తమ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వైద్య సిబ్బంది, అధికారులకు నా తరపున పాదాభివందనం.
- వైద్య సిబ్బందికి వారి గ్రాస్ సాలరీలో 10 శాతాన్ని ప్రోత్సాహకంగా ఇస్తాం.
- జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ సిబ్బందికి అదనంగా రూ.7,500 , అలాగే
- గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుధ్య సిబ్బంది రూ.5,000 ఇస్తాం.
- సఫాయి అన్నలకు సలామ్ చేస్తున్నా.
- అసత్యాలు ప్రచారం చేస్తున్నవారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం.
- పీఎం పిలుపు మీద జోకులు,సెటైర్లు వేస్తూ సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియాగా మారింది. జాతి ఐక్యతను చాటేందుకు ఉపయోగపడే ఇలాంటి చర్యలను కూడా వెకిలిగా విమర్శిస్తున్నారు.
- రాష్ట్రంలో రేషన్ కార్డులు లేని పేదలకూ బియ్యంతో పాటుగా ఆర్థిక సహాయం కూడా తప్పనిసరిగా అందజేస్తాం. ఎవరిని ఉపవాసంతో ఉండనివ్వం.