ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాల అగ్ర నాయకులు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కు కరోనా వైరస్ సోకడంతో ఆయన ముందుగా స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. అయితే వైరస్ లక్షణాలు తగ్గకపోవడంతో ఏప్రిల్ 5, ఆదివారం నాడు ఆయన్ను ఆస్పత్రిలో చేర్చారు. బోరిస్ జాన్సన్ వ్యక్తిగత డాక్టర్ సూచించడం వలనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 6, సోమవారం నాటికీ బోరిస్ లో వ్యాధి తీవ్రత పెరగడంతో వైద్యులు వెంటనే ఆయన్ను ఐసీయూకి తరలించినట్టుగా తెలిపారు.
ముందుగా కరోనా లక్షణాలు కొనసాగుతుండడంతో స్వీయ నిర్బంధాన్ని మరికొన్ని రోజులు పొడిగించుకున్నట్లు బోరిస్ యే స్వయంగా వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. ఏడు రోజుల నిర్బంధం కూడా పూర్తయిందని, ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నాకూడా ఇంకా స్వల్పంగా కరోనా వైరస్ లక్షణాలు ఉండడంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం లక్షణాలు పూర్తిగా తొలగిపోయేంత కాలం స్వీయ నిర్బంధంలో ఉంటానని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. అనంతరం బోరిస్ లో వ్యాధి తీవ్రత పెరుగుతున్నట్టు వైద్యులు గుర్తించి ఆయన్ను ఐసీయూకి తరలించినట్టుగా తెలుస్తుంది.