ప్రధాని నరేంద్రమోడీతో మార్చ్ 17, మంగళవారం నాడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యంగా నాలుగు అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. హైదరాబాద్లో ఫార్మాసిటీ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు నిలిపివేయాలని మోదీని కోరినట్టు పేర్కొన్నారు. ఫార్మాసిటీని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం లేదని, అయితే హైదరాబాద్ శివారు నుంచి మరో ప్రాంతానికి తరలించాలని మోదీని కోరినట్లు చెప్పారు. ముందుగా మూడు వేల ఎకరాల్లో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, కానీ ఇప్పుడు 19,333 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టబోతున్నారని తెలిపారు.
ఫార్మాసిటీ వలన హైదరాబాద్పై కాలుష్య ప్రభావం ఉంటుందని, ఎయిర్ పోర్టు దగ్గరలో ఫార్మా సిటీ రానివ్వమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఫార్మాసిటీని మరొకచోట ఏర్పాటు చేయాలని సూచించినట్లుగా తెలిపారు. అలాగే హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు నుంచి కొత్తగూడెం వరకు జాతీయ రహదారిగా చేయడం, మూసీనది శుద్ధి చేయడం కోసం రూ.3 వేల కోట్లు కేటాయించడంతో పాటుగా సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు, భువనగిరి పార్లమెంట్ పరిధిలో నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని కోరినట్టు మీడియాకు వెల్లడించారు. తన విజ్ఞప్తులకు పట్ల ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని కోమటిరెడ్డి తెలిపారు.
[subscribe]