రేపు ప్రధాని మోదీ పర్యటన, ముచ్చింతల్ లో ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్, డీజీపీ

Telangana CS Somesh Kumar, DGP Mahender Reddy Inspected PM Modi Tour Arrangements in Muchintal

శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం, 216 అడుగుల ఎత్తు గలిగిన శ్రీరామానుజుల విగ్రహం ఉన్న శ్రీరామనగరం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆకాంక్షించారు. రేపు శనివారం నాడు ముచ్చింతల్ లో శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ కార్యక్రమం సందర్బంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను డీజీపి మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలసి నేడు పరిశీలించారు. ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మార్గదర్శకంలో చేపట్టిన యాదాద్రి పునర్నిర్మాణ ఆలయం హైదరాబాద్ కు ఒక వైపు అద్భుత దర్శనీయ క్షేత్రంగా మారనుండగా, మరో వైపు 216 అడుగుల ఎత్తైన సమతా మూర్తి విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) కలిగిన ముచ్చింతల్ మరో అద్భుత క్షేత్రంగా మారనుందని ఆకాక్షించారు. ముచ్చింతల్ లోని శ్రీరామ నగరం ప్రపంచంలోని వైష్ణవ ఆరాధకులకు ప్రధాన క్షేత్రంగా మారుతుందని అన్నారు.

ప్రధాని, రాష్ట్రపతి ఇతర ప్రముఖుల పర్యటనలతోపాటు ఈ నెల 14వ తేదీ వరకు జరిగే రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లను చేసిందని అన్నారు. ఈ ఉత్సవాల ఏర్పాట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వయంగా గురువారం నాడు పరిశీలించారని, ఆయన ఆదేశాల మేరకు తిరిగి ఈ రోజు ఏర్పాట్లను సమీక్షించడానికి డీజీపి, ఇతర సీనియర్ అధికారులతో వచ్చామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డీజీపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధానిమోదీతో పాటు ఇతర ప్రముఖుల పర్యటనలతో ఈనెల 14 తేదీ వరకు జరిగే శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ విస్తృత ఏర్పాట్లను చేపట్టిందని పేర్కొన్నారు. ప్రధాని, రాష్ట్రపతి పర్యటన రోజుల్లో ముచ్చింతల్ ఆశ్రమానికి సాధారణ ప్రజలకు అనుమతి లేదని, కేవలం ప్రత్యేక పాసులు కలిగిన వారిని మాత్రమే అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకై దాదాపు 8 వేలకుపైగా పోలీసు అధికారులచే బందోబస్తు ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. పూర్తిగా కోవిడ్ నిబంధనలను పాటించడం జరుగుతుందని, మొత్తం కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. మరోవైపు ఈ ఉత్సవాలలో మూడవ రోజైన శుక్రవారం నాడు నిర్వహించిన అష్టాక్షరీ మంత్ర జపం, పూర్ణాహుతి అనంతరం శ్రీ చినజీయర్ స్వామి సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపి మహేందర్ రెడ్డి లతోపాటు ఇతర అధికారులకు ప్రసాదాన్ని అందించారు.

ముందుగా సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలు వివిధ శాఖల అధికారులతో కలిసి అక్కడ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. మొత్తం ముచ్చింతల్ ప్రాంతాన్ని, ఇక్కడికి వచ్చే మార్గాలన్నింటిని కవర్ చేసిన సీసీ టీవీలను పరిశీలించే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా వివిధ సామాజిక మాధ్యమాలు, వార్తా ఛానెళ్లలో వచ్చే అనుకూల, ప్రతికూల వార్తలను ఎప్పటికప్పుడు సమీక్షించి తగు ఆదేశాలు అందచేసే విభాగాన్ని సీఎస్, డీజీపీ పరిశీలించారు. అనంతరం 1035 యాగ కుండలిలు ఏర్పాటు చేసిన యాగశాలను, అక్కడ అగ్నిమాపక శాఖ, విద్యుత్, శానిటేషన్ విభాగాలు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని, ఇతర ప్రముఖులు దిగే హెలిపాడ్ ను, ప్రధాని స్వల్ప బస చేసే గెస్ట్ హౌస్ ను పరిశీలించారు.

ప్రపంచంలొనే రెండవ అతిపెద్ద విగ్రహం, 216 అడుగుల ఎత్తైన శ్రీ రామానుజుల విగ్రహ స్థలాన్ని పరిశీలించారు. ప్రధాని ఆవిష్కరించనున్న సమతా మూర్తి విగ్రహ పరిసర ప్రాంతాలు, ప్రధాని వచ్చే మార్గాలను పరిశీలించారు. ప్రధాని తోపాటు పాల్గొనే వారి జాబితాను కచ్చితంగా ఎస్.పీ.జి అనుమతించాల్సి ఉంటుందని నిర్వాహకులకు స్పష్టం చేశారు. ఇక్కడే ఏర్పాటుచేసిన లేజర్ షో ప్రాంతం లో బందోబస్తును సంబంధిత అధికారులతో సమీక్షించారు. అనంతరం ప్రధాని మోదీ దిగనున్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లి అక్కడ ఏర్పాట్లను కూడా సీఎస్, డీజీపీ పరిశీలించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =