తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జూన్ 5, శుక్రవారం నాడు పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమీషనర్ రఘునందన్ రావులతో కలిసి కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో పర్యటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు గ్రామాలలో పల్లెప్రగతి పనులు, పారిశుధ్ద్య కార్యక్రమాలను పరిశీలించేందుకు జిల్లాలోని 2 గ్రామ పంచాయతీలను ఆకస్మికంగా సందర్శించినట్లు సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు.
ప్రతిజిల్లాలోని రెండు గ్రామ పంచాయతీలలో పారిశుధ్ద్య, పల్లెప్రగతి పనులు, వైకుంఠధామాలు, డంప్ యార్డుల నిర్మాణం, నర్సరీల సందర్శనలపై దృష్టి సారించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆయన తెలిపారు. కోవిడ్ వలన నిధుల కొరత ఉన్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల గ్రామపంచాయతీలకు 308 కోట్ల రూపాయలు విడుదల చేస్తుందని వివరించారు.
ఈ పర్యటనలో భాగంగా సీఎస్ సోమేష్ కుమార్ ముందుగా కామారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని తిర్మన్ పల్లి, కామారెడ్డి మండలం లోని గర్గుల్ గ్రామాలను సందర్శించి పల్లెప్రగతి కార్యక్రమాలను పరిశీలించారు. మిషన్ భగీరథ నల్లాలు, హరితహారం నర్సరీ, రైతువేదిక నిర్మాణ స్ధలాన్ని పరిశీలించారు. వానాకాలం పంటల సాగు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నర్సరీలో మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రజలు క్షేమంగా ఉండాలంటే ఆరోగ్యం బాగుండాలని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్, వైకుంఠధామం, నర్సరీలు ఏర్పాటు అయ్యాయని చెప్పారు. 2 గ్రామాలలో పనులు బాగా చేపట్టినందుకు జిల్లా కలెక్టర్, అధికారులు, సర్పంచ్, ఎంపీపీకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మరింత అభివృద్ధి కోసం సూచనలు ఇచ్చామన్నారు. నర్సరీలో మొక్కల పెంపకం బాగుందని, 3 నెలల తర్వాత మరొకసారి సందర్శిస్తామన్నారు.
కామారెడ్డి జిల్లా పర్యటన అనంతరం సీఎస్ సంగారెడ్డి జిల్లాలో కంది మండలం ఎద్దుమైలారం, కొండాపూర్ మండలం గుంతపల్లి గ్రామాలలో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. వర్షాకాలంలో హరితహారానికి సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. పట్టణ ప్రాంతాల్లో మాత్రమే పార్కులు ఉన్నాయని, గ్రామాల్లో కూడా పార్కులు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని ఆయన సూచించారు. గ్రామాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. గ్రామాల సందర్శనకు ముందుగా గీతం యూనివర్సిటీ ఆవరణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొక్కలు నాటారు. సంగారెడ్డి జిల్లా పర్యటన అనంతరం సీఎస్ సోమేష్ కుమార్ వికారాబాద్ కొత్త కలెక్టర్ కార్యాలయం వద్ద హెలిక్యాప్టర్ లో దిగి వికారాబాద్ మండలం పెండ్లిమడుగు గ్రామం, నవాబుపేట మండలం దాతాపూర్ లలో పల్లె ప్రగతి లో జరుగుతున్న పనులను అకస్మికంగా తనిఖీ చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu