ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సీనియర్ అధికారులతో కలసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం నాడు గోల్కొండ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఇక్కడ నిర్వహిస్తున్న రెండవ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి, రెండవ డోస్ తీసుకొనేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడారు. వ్యాక్సినేషన్ కు గరిష్టంగా 15 నిమిషాలు సమయం పడుతుందని, వ్యాక్సినేషన్ అనంతరం మరో 30 నిమిషాలు పరిశీలనలో ఉంచుతున్నట్లు వ్యాక్సినేషన్ కు వచ్చిన ప్రజలు సీఎస్ కు వివరించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాక్సిన్ వేయించుకొని 40-45 నిమిషాలలో ఇండ్లకు తిరిగి వెళ్తున్నట్లు వారు తెలిపారు.
మొదటి డోస్ కోవ్యాక్సిన్ వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం నాలుగు వారాలు పూర్తి అయిన వ్యక్తులు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం ఆరు వారాలు పూర్తి ఆయిన వ్యక్తులు ఈ నెల 10,11, 12 తేదీలలో ఏదైనా ప్రభుత్వం వ్యాక్సినేషన్ సెంటర్ లో రెండవ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ సందర్భంగా గోల్కొండ ఏరియా ఆసుపత్రిలోని వివిధ వార్డులను, అందుబాటులోవున్న వసతులను సీఎస్ సోమేశ్ కుమార్ తనిఖీ చేసారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా అన్ని పడకలకు ఆక్సిజన్ పైప్ లైన్ సదుపాయం కల్పించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 100 కోవిడ్ పడకలకు వారం రోజులలో ఆక్సిజన్ సరఫరా అందుబాటులోకి రానున్నది. అదే విధంగా ఈ ఆసుపత్రిలో ప్రసూతి, అత్యవసర వైద్య సేవలకై సరిపడ పడకలను అందుబాటులో ఉంచుతున్నారు.
అలాగే సీఎం ఆదేశాల మేరకు పడకల సంఖ్యను పెంచుటకు, అదనంగా 120 పడకల ఏర్పాటుకు అనువుగా ఆసుపత్రి పైభాగంలో ఒక కొత్త అంతస్తును నిర్మించనున్నారు. ఈ అంతస్తు ఏర్పాటు పనులు ప్రారంభమై, పురోగతిలో వున్నాయి. మరో నెల రోజులలో ఈ అదనపు పడకలు అందుబాటులోకి రానున్నాయి. తదనుగుణంగా ఈ పడకలను వినియోగంలోకి తెచ్చుటకు అనువుగా అదనపు మానవ వనరులను, ఇతర వసతులను సమకూర్చుటకు ప్రణాళికను రూపొందించాలని వైద్య విద్య డైరెక్టర్ ను సీఎస్ ఆదేశించారు. గోల్కొండ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్.యం.ఒ, ఇతర వైద్యులతో సీఎస్ మాట్లాడి, ఈ సమయంలో వారు అందిస్తున్న సేవలను అభినందించారు. గోల్కొండ ఏరియా ఆసుపత్రి సందర్శనలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి, జోనల్ కమీషనర్ ప్రావిణ్య, టిఎస్ఎంఎస్ఐడిసి ఎండి చంద్రశేఖర్ రెడ్డి, టిఎస్ఐఐసి ఎండి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ