తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విమాన ప్రయాణంలో అస్వస్థతకు గురైన ఒక ప్రయాణికుడికి అత్యవసర చికిత్సనందించారు. వారణాసి వెళ్లిన గవర్నర్ తిరుగు ప్రయాణంలో భాగంగా ఢిల్లీ- హైదరాబాద్ మధ్య అర్ధరాత్రి నడిచే ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఇది చోటుచేసుకుంది. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి ప్రయాణం మధ్యలో అస్వస్థతకు గురయ్యాడు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటి తర్వాత ఆ ప్రయాణికుడికి ఛాతీలో నొప్పి రావడంతో, విషయాన్ని విమాన సిబ్బందికి తెలిపాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానంలో ఉన్నవారిలో ఎవరైనా వైద్యులు ఉన్నారా అని ప్రకటన ద్వారా అడిగారు.
దీంతో స్పందించిన గవర్నర్ తమిళిసై వెంటనే ఆ ప్రయాణికుడి వద్దకి వెళ్లి ప్రాథమిక చికిత్స చేసి ఉపశమనం కలిగించారు. చికిత్స అనంతరం కొద్దిసేపు అతడి వద్దే కూర్చొని భరోసా ఇచ్చారు. ప్రథమ చికిత్స అందడంతో కొద్దిసేపటికి కోలుకున్న ఆ ప్రయాణికుడు గవర్నర్కు కృతజ్ఞతలు తెలిపాడు. ఆయనతో పాటు ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు కూడా తమిళిసైకు అభినందనలు తెలిపారు. అయితే అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు ఈ చికిత్స క్రమాన్ని ఫోటోలు తీసి తన ట్విట్టర్ లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్యవిద్యలో ఉన్నత విద్యా వంతురాలు. ఇక విమానంలో ప్రయాణం మధ్యలో చికిత్స అందించి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడారని తెలియడంతో గవర్నర్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ