రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో శుక్రవారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (సెప్టెంబర్ 17, శనివారం) తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు విద్యాసంస్థలకు శనివారంను సెలవు దినంగా ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ముందుగా రాచరిక వ్యవస్థ నుండి తెలంగాణ ప్రాంతం ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టి 2022 సెప్టెంబర్ 17 నాటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మూడు రోజులపాటు (సెప్టెంబర్ 16, 17, 18, 2022 తేదీల్లో) రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా శుక్రవారం 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అత్యంత ఉత్సాహంగా జాతీయ సమైక్యతా ర్యాలీలు జరిగాయి. ఆయా నియోజక వర్గాల్లో సంబంధిత జిల్లాల నుండి ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్ లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇక సెప్టెంబర్ 17, శనివారం హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు/ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేస్తారు. అదేవిధంగా శనివారం సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో కొమరం భీమ్ ఆదివాసీ భవనం మరియు సంత్ సేవాలాల్ బంజారా భవన్ లను కూడా ప్రారంభిస్తారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు పీవీమార్గ్ లోని పీపుల్స్ ప్లాజా నుండి సెక్రెటరియేట్ మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు ర్యాలీ జరగనుంది. గిరిజన సంఘాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి గిరిజనులు పెద్దఎత్తున ఈ సభకు రానున్నారు. గిరిజన సంప్రదాయాలను తెలియజెప్పే విధంగా కళాకారులచే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరోవైపు వేడుకల్లో భాగంగా 18న అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ పాల్గొనాలని ప్రభుత్వం సూచించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY