తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవనం నిర్మాణం కోసం పాత భవనాల కూల్చివేత, శిథిలాల తొలగింపులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 27, సోమవారం సాయంత్రం 4 గంటలకు బి.ఆర్.కె. భవన్ నుంచి మీడియా ప్రతినిధులను సిటీ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో తీసుకెళ్ళి, సెక్రటేరియట్ ప్రాంతాన్ని చూపిస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత రెడ్డి వెల్లడించారు.
సచివాలయం వద్ద ఇప్పటికే దాదాపు 90 శాతం కూల్చివేత పనులు పూర్తయ్యాయి. శిథిలాలు (వ్యర్థాలు) మొత్తం దాదాపు 4500 లారీల లోడు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ఇప్పటికే 2వేల లారీల ట్రిప్పులు ఎత్తివేయగా, మిగతా పనులు జరుగుతున్నాయి. ఎత్తైన భవనాలు కూల్చివేసే సందర్భంలో ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలోకి ప్రభుత్వం ఎవరినీ అనుమతించలేదు. అందులో భాగంగా మీడియాను కూడా అనుమతించలేదు.
ఈ నేపథ్యంలో కూల్చివేత వార్తలు సేకరించడానికి అనుమతి ఇవ్వాలని మీడియా ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఈ విజ్ఞప్తిని పరిశీలించి, కూల్చివేత పనులకు, వ్యర్ధాల తొలగింపు పనులకు సంబంధించిన వార్తల సేకరణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. అయితే కూల్చివేతల సందర్భంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వమే మీడియా ప్రతినిధులకు ఆ ప్రాంతాన్ని చూపించాలని నిర్ణయించినట్లు మంత్రి వేముల ప్రశాంత రెడ్డి వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu