తెలంగాణ రాష్ట్రంలో అవసరమైన యూరియా అందుబాటులో ఉందని, యూరియాపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ వానాకాలానికి కావాల్సిన అన్నిరకాల ఎరువులు కలిపి 22.30 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, ఇందులో 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందన్నారు. ఈ మొత్తం ఇచ్చేందుకు కేంద్రం ఆమోదించిందని, దీనిని దశల వారీగా రాష్ట్రానికి తీసుకురావడం జరిగిందని చెప్పారు. జూలై నెలకు సంబంధించిన కోటా 2.05 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉండగా, 1.06 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వచ్చిందని, మిగతాది ఈ నెలాఖరుకు ఇస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని మంత్రి వెల్లడించారు.
కరోనా సమయంలో ఇబ్బందులు రాకుండా సీఎం కేసీఆర్ వ్యవసాయంపై పలుమార్లు సుధీర్ఘ సమావేశాలను ఏర్పాటు చేసి శాఖకు మార్గదర్శనం చేశారని చెప్పారు. అంతా సమర్ధంగా జరుగుతున్న చోట రైతులలో ఆందోళన, గుబులు పుట్టించడానికి, స్థైర్యం దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా పనిచేస్తున్నాయని, ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి చెప్పారు.
ఈ రోజుకి రాష్ట్రవ్యాప్తంగా డీలర్లు, సహకార సంఘాలు, మార్క్ ఫెడ్, వ్యవసాయ శాఖ కమీషనర్ వద్ద ఎక్కడా యూరియా కొరత లేదు. పత్తి పంటకు అవరసరమైన రెండో విడత యూరియా కూడా రైతులు వాడుకున్నారు. మిగిలింది ఇక వరినాట్లకు మాత్రమేనని, ప్రస్తుతం రాష్ట్రంలో 1.56 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రిసింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu