నెలవంక దర్శనమివ్వడంతో ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ముస్లిం కరోనా పేషంట్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రంజాన్ మాసంలో ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తారు. దీంతో ప్రస్తుతం కరోనా వలన ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్లలోనూ ఉన్న ముస్లింలకు వారి ఇళ్లలో చేసుకునే వంటకాల మాదిరిగానే నాణ్యమైన రంజాన్ ఫుడ్ను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన రంజాన్ మెనూ ఏప్రిల్ 25, శనివారం నుంచి అందుబాటులోకి రానుంది.
తెల్లవారుజామున 3.30 గంటలకు ఉపవాసదీక్షను ప్రారంభించనున్న నేపథ్యంలో కరోనాకు చికిత్స తీసుకుంటున్న ముస్లిం పెషంట్లకు కూడా ఆ సమయానికే మెనూ ప్రకారం ఫుడ్ సిద్ధం చేయనున్నారు. తెల్లవారుజామున షెహరి లో భాగంగా రొట్టేలు, వెజ్ కర్రీ, దాల్ అందించనున్నారు. ఇక సాయంత్రం ఉపవాస దీక్ష తర్వాత ఇఫ్తార్ విందులో భాగంగా చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, భగారా రైస్, కిచిడీ, దాల్చా, వెజ్ బిర్యానిని అందించనున్నారు. అలాగే మటన్ కర్రీ లేదా చికెన్ కర్రీని రోజు విడిచి రోజు అందుబాటులో ఉంచనున్నారు. ఇక అల్ఫాహారంగా ఖర్జూరం, అరటిపండ్లు, ఇతర పండ్లను వడ్డిస్తారు. మరోవైపు గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న ముస్లిమేతర కరోనా పెషంట్లను వేరే గదిలోకి తరలించనున్నట్టుగా తెలుస్తుంది. ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు వీలుగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu