కరోనా చికిత్సలో భాగంగా పలు ప్రైవేట్ ఆసుపత్రులు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయని బాధితులు నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఫీజులు వసూలు చేయాలని ప్రైవేటు ఆస్పత్రులను తాజాగా ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రజారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు ఆగస్టు 12, బుధవారం నాడు ఉత్తర్వులు ఇచ్చారు. కరోనా చికిత్సకు సంబంధించి అన్ని ఫీజుల వివరాలను ఆసుపత్రులలో బోర్డులు ఏర్పాటు చేసి ప్రదర్శించాలని పేర్కొన్నారు.
పీపీఈ కిట్లు, ఖరీదైన మందుల ధరలకు ఎమ్మార్పీ ప్రకారమే బిల్లు వసూలు చేయాలని, వాటి ధరలను కూడా బోర్డు ద్వారా ప్రదర్శనలో ఉంచాలని చెప్పారు. కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యే సమయంలో దేనికి ఎంత బిల్లు వేశారనే పూర్తి సమాచారంతో బిల్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంటూ, నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu