తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో తొమ్మిదవ తరగతి నుండి ఆ పై తరగతులకు ఫిబ్రవరి 1 నుంచి తరగతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవలే ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 9, 10, ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల తరగతుల ప్రారంభానికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ పలు మార్గదర్శకాలు జారీ చేసింది.
విద్యాశాఖ జారీచేసిన మార్గదర్శకాలు ఇవే:
- విద్యార్థులు తరగతులకు హాజరయ్యే విషయంలో తల్లిదండ్రుల నుంచి లిఖిత పూర్వక అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
- ప్రత్యక్ష తరగతులకు హాజరుకాని విద్యార్థులకు యాజమాన్యాలు ఆన్లైన్ తరగతులు కొనసాగించవచ్చు.
- 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించవద్దు, డిటెన్షన్ కూడా ఉండదు.
- 9 తరగతి నుంచి పైతరగతులకు బోధించే ఉపాధ్యాయులు ప్రతి రోజూ హాజరు కావాలి.
- ఈ సంవత్సరం పరీక్షలు రాసేందుకు విద్యార్థులకు కనీస హాజరు శాతం తప్పనిసరి కాదు.
- 70 శాతం సిలబస్ బోధన, మిగిలిన 30శాతం సిలబస్ ప్రాజెక్ట్ వర్క్స్ మరియు అసైన్మెంట్స్.
- 10 వ తరగతి పరీక్షలు షెడ్యూలు తర్వాత విడుదల, పరీక్షలు ముగిసిన రోజునే చివరి పనిదినంగా పరిగణన.
- జూనియర్ కాలేజీల్లో 300 కంటే తక్కువ విద్యార్థులు ఉంటే ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు తరగతులు నిర్వహణ.
- 300 కంటే ఎక్కువుంటే రెండు షిఫ్టులుగా 8.30 నుంచి 12.30 వరకు ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు మరియు 1.30 నుంచి 5.30 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు నిర్వహించాలి.
- ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షల షెడ్యూల్ త్వరలోనే ప్రకటన.
- డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కాలేజీల్లో 50 శాతం మంది విద్యార్థులను అనుమతించి భౌతికదూరం పాటిస్తూ ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలి. రొటేషన్ పద్ధతిలో తరగతులు జరగాలి.
- డిగ్రీ, పీజీ, వృత్తివిద్య కోర్సుల విద్యార్థులకు ఈ సెమిస్టర్ లో కనీస హాజరు తప్పనిసరి కాదు.
- పాఠశాలలు, కాలేజీలు పూర్తిగా శానిటైజేషన్ చేయాలి. విద్యాసంస్థల ఆవరణ ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
- కరోనా వ్యాప్తి దృష్ట్యా విద్యాసంస్థల్లో కనీసం రెండు ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేసుకోవాలి. శానిటైజర్లను అందుబాటులో ఉంచి, కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ