రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో అవసరమైన సర్వే నిర్వహించి అర్హులైన లబ్ధిదారులందరికి పెన్షన్స్ మంజూరు చేయాలని, అన్ని చర్యలు తీసుకోవాలని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (ఎస్ఈఆర్పీ) సీఈవోకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా బుధవారం నాడు ఉత్తర్వులు జారీచేశారు.
ముందుగా ఈ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆగస్టు 1న జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వృద్ధాప్య పెన్షన్లకు అర్హతను 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర కేబినెట్ అధికారులను ఆదేశించింది. కుటుంబంలో ఒక్కరికే పింఛను పద్ధతిని కొనసాగిస్తూ భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు వెంటనే పెన్షన్ బదిలీ చేయాలని, ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో మరో 6,62,000 కొత్త పించన్లు పెరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పించన్ల సంఖ్య 58 లక్షలకు చేరుకోనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ