టోక్యో ఒలింపిక్స్-2020లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. 41 సంవత్సరాల తర్వాత హాకీలో ఒలింపిక్ పతకం సాధించి, కోట్లాది భారతీయులను ఆనందంలో ముంచింది. గురువారం ఉదయం కాంస్య పతకం కోసం జర్మనీతో జరిగిన మ్యాచ్లో భారత్ జట్టు 5-4 గోల్స్ తేడాతో అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత్ జట్టు ఈ మ్యాచ్ ఆసాంతం అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ, ప్రత్యర్థి జర్మనీ జట్టుపై హోరాహోరీగా పోరాడింది. చివరి నిమిషం వరకు కూడా ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో భారత జట్టు సత్తా చాటుతూ చిరస్మరణీయ విజయం సాధించి దేశానికి కాంస్య పతకం అందించింది.
భారత ఆటగాళ్లలో సిమ్రన్ జీత్ సింగ్ రెండు గోల్స్ చేయగా, హార్దిక్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్ తలోక గోల్ చేశారు. అయితే భారత్ విజయంలో గోల్ కీపర్ శ్రీజేష్ కీలక పాత్ర పోషించాడు. చివర్లో ప్రత్యర్థికి వచ్చిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని గోల్ కాకుండా అడ్డుకుని భారత్ కు విజయాన్ని ఖరారు చేశాడు. సెమీస్ లో పరాజయంతో నిరాశ చెందినప్పటికీ కీలక కాంస్యం మ్యాచ్ లో వీరోచితంగా పోరాడి ఒలింపిక్స్ లో దేశానికి కాంస్యం పతకం అందించిన భారత పురుషుల హాకీ జట్టుకు పలువురు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో పాటుగా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, రాజకీయనాయకులు, క్రీడా, సినీరంగ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా హాకీ జట్టు పోరాటపటిమపై ప్రశంసలు కురిపించారు. ఇప్పటివరకు భారత హాకీ జట్టు ఒలింపిక్స్ లో 8 బంగారు పతకాలు, ఒక రజతం, మూడు కాంస్య పతకాలు సహా మొత్తం 12 పతకాలు గెలుచుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ