తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులనుంచి కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కరోనా నియంత్రణ కోసం లాక్డౌన్ ను పూర్తీ స్థాయిలో అమలు చేయడంతో పాటుగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రప్రజలు ఎవరూ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు వెళ్లకుండా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండి, అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో సరిహద్దు జిల్లాలలో నివసిస్తున్న ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది.
ఆయా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలలోని ప్రజలు వైద్యం నిమిత్తంగాని, ఇతర అత్యవసర పనులకు కూడా ఏపీ, మహారాష్ట్రకు వెళ్లేందుకు వీలులేదని ప్రకటించారు. ఈ మేరకు సరిహద్దుల్లో పర్యవేక్షణ కోసం పోలీసు బలగాలను మోహరిస్తునట్టు తెలుస్తుంది. ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో, తెలంగాణలోని గద్వాల, మహబూబ్నగర్ జిల్లాల ప్రజలు అక్కడికి వెళ్లకుండా రాకపోకలను నిషేధించారు, అలాగే ఖమ్మం, నల్గొండ ప్రాంతాల ప్రజలను కూడా ఏపీలోని విజయవాడ, గుంటూరు వైపు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu