తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర వృత్తివిద్యా కోర్సుల ఫీజులను ఈ ఏడాదికి పెంచకూడదని, గతేడాది అమలు చేసిన ఫీజులనే ఈ ఏడాది కూడా వర్తింపజేయాలని తీర్మానించింది. ఈ మేరకు సోమవారం జరిగిన టీఏఎఫ్ఆర్సీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇక సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై కమిటీ ప్రభుత్వానికి లేఖ రాయనుంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని ఆదేశాలను జారీ చేయనుంది. కాగా సాధారణంగా టీఏఎఫ్ఆర్సీ ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎడ్, లా వంటి వృత్తివిద్యా కోర్సుల ఫీజులను మూడేళ్లకోసారి సమీక్షించి తదనుగుణంగా ఫీజుల పెంపుపై నిర్మయం తీసుకుంటుంది.
అయితే గతంలో ఖరారు చేసిన ఫీజుల గడువు 2021-22తో ముగియనుండగా, వచ్చే మూడేళ్ల కోసం కొత్త ఫీజులను ఖరారు చేయాల్సి ఉండటంతో తాజాగా దీనిపై నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఫీజుల పెంపుపై కొన్ని ప్రతిపాదనలను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కనీస ఫీజును రూ.79,600గా, గరిష్ఠ ఫీజును రూ.1.89 లక్షలుగా నిర్ణయించింది. ఈ మేరకు బీఎన్ శ్రీకృష్ణ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. అయితే.. ఫీజులను సొంతగానే ఖరారు చేయాలని రాష్ట్రం నిర్ణయించడంతో దీనిపై కాలేజీ యాజమాన్యాల అభ్యర్థనలను కూడా స్వీకరించారు. కాలేజీల నుంచి వచ్చిన డిమాండ్లను పరిశీలించిన తర్వాత ఇంజనీరింగ్కు కనీస ఫీజును రూ.45 వేలు, గరిష్ఠ ఫీజును రూ.1.70 లక్షలుగా చేయాలని భావించారు.
అయితే సోమవారం జరిగిన టీఏఎఫ్ఆర్సీ భేటీలో అనూహ్యంగా ఈ ఏడాది ఫీజులను పెంచకూడదని నిర్ణయించారు. కరోనా కారణంగా గడచిన రెండేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, అందుకే ఈ ఏడాది ఫీజులు పెంచకూడదని కమిటీ అభిప్రాయపడింది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చిన సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంజనీరింగ్ కనీస ఫీజు రూ.35 వేలు కాగా, గరిష్ఠ ఫీజు రూ.1.40 లక్షలుగా ఉంది. వీటినే ఈ ఏడాది కూడా కొనసాగించనున్నారు. ఇంజనీరింగ్తో పాటు ఇతర వృత్తివిద్యా కోర్సులకూ గతేడాది ఫీజులనే వర్తింపజేయనున్నారు. కాగా కమిటీ నిర్ణయం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY