తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మే 5, మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం జరుగనుంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు, పొడిగింపు తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ గడువు మే 7 తేదీతో ముగియనుండడంతో తాజా పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. రాష్ట్రంలో గత వారం రోజులనుంచి కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తారా లేదా మరోసారి లాక్డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపుతారా అనే విషయంపై ప్రజల్లో ఆసక్తి నెలకొనివుంది. ఈ కేబినెట్ భేటీలో అన్ని అంశాలు పూర్తిస్థాయిలో చర్చించి, అనంతరం లాక్డౌన్ పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం వెల్లడించే అవకాశమున్నట్టు తెలుస్తుంది.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 29, గురువారం సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 1038 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కొత్తగా 22 కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 28 మంది మృతి చెందగా, 442 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. గురువారం ఒక్కరోజే 33 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వడం విశేషం. ప్రస్తుతం 582 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu