తెలంగాణ రాష్ట్రప్రభుత్వం “దళిత బంధు” పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఆగస్టు 16న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఆ సందర్భంగా దళిత బంధు కింద 15 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున సీఎం కేసీఆర్ చెక్కులను అందించారు. ఈ నేపథ్యంలో దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ. 500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలుకోసం మొత్తం 2000 కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మొదటి విడతలో భాగంగా ఆగస్టు 10న ఇప్పటికే విడుదల చేసిన రూ.500 కోట్లతో పాటు తాజాగా విడుదల చేసిన రూ.500 కోట్లు కలిపి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పైలట్ ప్రాజెక్టుకు గాను మొత్తం రూ.1000 కోట్ల నిధులు విడుదలయ్యాయి. కాగా వారం రోజుల్లోపు మరో రూ.1000 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనున్నట్టు తెలిపారు. దీంతో సీఎం కేసీఆర్ ప్రకటించిన హుజూరాబాద్ కు రూ.2000 కోట్ల దళిత బంధు నిధులు పూర్తి స్థాయిలో విడుదల కానున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ