వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు. మంగళవారం ఆమె ప్రగతి భవన్ ముట్టడికి యత్నించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సోమవారం షర్మిల పాదయాత్రలో టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేయడం, తదనంతర పరిణామాలలో ఆమెను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈరోజు వైఎస్ షర్మిల నిన్నటి దాడిలో పాక్షికంగా ధ్వంసమైన కారులో కూర్చుని తన అనుచరులతో ప్రగతి భవన్ వైపుకు వెళ్తుండగా గుర్తించిన పోలీసులు ముందుగానే ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమెను కారునుంచి దించడానికి ప్రయత్నించగా.. వాహనం డోర్స్ తో పాటు అద్దాలు క్లోజ్ చేసి ఉండటంతో సాధ్యం కాలేదు.
దీంతో పోలీసులు అనూహ్యంగా షర్మిల కారులో ఉండగానే, ఆమె కారుని ట్రాఫిక్ వాహనాల తరలింపుకు వినియోగించే క్రేన్కు కట్టి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక కూడా షర్మిల కిందకు దిగకపోవడంతో పోలీసులు బలవంతంగా డోర్స్ ఓపెన్ చేసి ఆమెను బయటకు రప్పించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా నెలకొంది. ఈ నేపథ్యంలో ఒకవైపు వైఎస్సార్టీపీ శ్రేణులు, మరోవైపు పోలీసులు భారీగా మోహరించడంతో ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా షర్మిల పోలీసుల వైఖరిపై మండిపడ్డారు. నిన్నటి ఘటనపై వివరించేందుకు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించానని, అయితే ఇవ్వకపోవడంతో నేరుగా ప్రగతి భవన్ వద్దకు వచ్చానని వైఎస్ షర్మిల తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE