తెలంగాణ రాష్ట్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 36 ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు డిసెంబర్ 19, గురువారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల సత్వర విచారణ చేసే నిమిత్తం తెలంగాణ హైకోర్టు చొరవ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో రెండేసి ఫాస్ట్ట్రాక్ కోర్టులు, మిగతా జిల్లాల్లో ఒక్కో ఫాస్ట్ట్రాక్ కోర్టు చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఆయా జిల్లాల అదనపు సెషన్స్ న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పని చేయనున్నాయి.
దేశ వ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై జూలైలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం సుప్రీం కోర్టు దేశాల మేరకు కేంద్ర న్యాయశాఖ అన్ని రాష్ట్రాల హైకోర్టులకు లేఖలు రాసింది. ఈ విషయంపై సుప్రీం కోర్టు ఆదేశాలను వివరిస్తూ తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అలాగే లైంగిక దాడుల కేసుల్లో సత్వరమే విచారణ జరగాలంటూ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని 36 ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
[subscribe]