రాష్ట్ర పర్యటనకు వచ్చిన 15వ ఆర్థిక సంఘం బృందం డిసెంబర్ 19, గురువారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో భేటీ అయింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్ కే సింగ్ నేతృత్వంలోని బృందానికి సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర పరిస్థితిని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సాయం పెంచాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. విభజన వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయిందని చెప్పారు. పారిశ్రామిక, సేవారంగాల్లో వృద్ధి లేదని, తిరిగి అన్ని రంగాల్లో రాష్ట్రం కోలుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందేలా సిఫార్సులు చేయాలని కోరారు. దాదాపు 2 గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రం యొక్క ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక, మౌలిక, ఇతర రంగాలపై అధికారులు ఆర్థిక సంఘ బృందానికి పూర్తి వివరాలు అందించారు.
అలాగే రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలు, వివిధ రంగాల్లో మార్పుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆర్థిక సంఘానికి వివరించారు. అలాగే రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, ప్రత్యేక హోదా హామీ, ఇతర అంశాలను సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించినట్టు తెలుస్తుంది. రాష్ట్ర పరిస్థితిపై నివేదిక అందజేసి, విభజన హామీల మేరకు రాష్ట్రానికి కేటాయింపులు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్, విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ తదితరులు పాల్గొని ఆయా రంగాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు.
[subscribe]