శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసిల కృష్ణా నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి, అందుకు సంబంధించిన జీవో కూడా విడుదల చేసింది. ఈ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తీవ్ర అభ్యంతరకరమని చెప్పారు. ఈ నిర్ణయంపై వెంటనే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఈ నేపథ్యంలో ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఛైర్మన్కు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని, అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం వీలుకాదని ఈ లేఖలో పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచకుండా చూడాలని, అలాగే 80 వేల క్యూసెక్కులకు పెంచే పనుల టెండర్లను చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. మరోవైపు ఈ అంశంపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఛైర్మన్ తో రజత్ కుమార్ బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu