తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్లులపై ఎఫ్సీఐ చేస్తున్న తనిఖీల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ ఆలస్యమవుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ మండలం దుర్షేడ్ గ్రామంలో మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణాలో అకాల వర్షాలతో ధాన్యం పొలాల్లోనే తడిసిపోతోందని, ప్రస్తుతం తనిఖీలకు ఇది సమయం కాదని అన్నారు. తనిఖీల పేరుతో రైతులు, రైస్ మిల్లర్లను ఇబ్బంది పెట్టవద్దని ఎఫ్సీఐ అధికారులను కోరారు. ఎఫ్సీఐ నిర్వహిస్తున్న తనిఖీల వల్ల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం కలుగుతోందని, దీని వలన నష్టపోయే రైతుల బాధ్యత కేంద్రమే వహించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లుపై ప్రతిపక్షాల ఆరోపణలు నిరాధారమని, దీనిపై బుధవారం శ్వేత పత్రం విడుదల చేసినట్లు మంత్రి ప్రకటించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరి పండక పోవడం వలన రైతుల కష్టాలు వారికి అర్ధమవట్లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్, పంజాబ్, ఒడిషా, చత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేకపోవడం వల్లనే ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్రం నుంచి సహకారం లేకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను దృష్టిలో పెట్టుకుని పౌర సరఫరాల శాఖకు రూ.3 వేల కోట్లు నిధులిచ్చారని వెల్లడించారు. కేంద్రం నుండి ఒక్క బ్యాగు రాకున్నా 8 కోట్ల గన్నీ బ్యాగులను సేకరించామని, ఇంకా దాదాపు మరో 7 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవుతాయని, యుద్ధ ప్రాతిపదికన కేంద్రమే వాటిని అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 3525 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, 821 కోట్ల విలువైన 4,21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 55,553 మంది రైతుల నుండి సేకరించామని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ